వనపర్తి, వెలుగు: రాష్ట్రంలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారందరినీ గుర్తించి మందులు అందజేస్తున్నామని, వారికి టెస్టులు అవసరం లేదని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి పర్యటించారు. హరీశ్రావు మాట్లాడుతూ రెండు టీకాలు తీసుకున్న వారికి కరోనా సోకడం లేదన్నారు. కేసీఆర్ కిట్తోనే ప్రభుత్వ దవాఖానాల్లో డెలివరీలు పెరిగాయన్నారు.
స్టేట్ వైడ్గా 12 పాలియేటివ్ కేర్ సెంటర్లు
నాగర్కర్నూల్ : నాగర్ కర్నూల్జిల్లా దవాఖానాలో పాలియేటివ్ కేర్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు మాట్లాడారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ చివరిదశలో ఉన్నవారికి బాధ తెలియకుండా పాలియేటివ్ కేర్సెంటర్లో వైద్య సేవలందిస్తారన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మరో 12 పాలియేటివ్ సెంటర్స్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. వీటిని సంజీవిని కేంద్రాలుగా మారుస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించే ‘మన ఊరు మన బడి’లో భాగంగా అన్ని చోట్లా ఇంగ్లిష్ మీడియం క్లాసులు ప్రారంభిస్తామన్నారు. కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ బడుల్లో ఫెసిలిటీస్కల్పించేందుకు రూ.7,280 కోట్లు సమకూరుస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏ మంచి పని చేసినా ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తామంటే గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు.
మరోవైపు జిల్లాలోని పెంట్లవెళ్లిలో మంత్రి కాన్వాయిని బీజేపీ, బీజేవైఎం లీడర్లు, కార్యకర్తలు అడ్డుకున్నారు. స్టేట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఎన్నికల టైంలో హామీ ఇచ్చినట్టు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, కొల్లాపూర్ నియోజకవర్గానికి పాలిటెక్నిక్ కాలేజీ, పెద్దకొత్తపల్లి, చిన్నంబావి,పెంట్లవెల్లి మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 20 నిమిషాల పాటు వెహికిల్కు అడ్డం పడటంతో కాన్వాయ్ నిలిచిపోయింది. దీంతో మంత్రి వేరే వాహనంలో వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ లీడర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత వారిని పీఎస్కు తరలించారు. మంత్రి వస్తున్నాడని జిల్లా కేంద్రంలో బీజేపీ లీడర్లను ముందుగానే హౌస్అరెస్ట్ చేశారు.