
- ముందు కేసీఆర్ను అసెంబ్లీకి రప్పించి.. ఆ తర్వాత మాట్లాడాలే : మంత్రి కొండా సురేఖ
వరంగల్, వెలుగు : అధికారం పోవడంతో కేటీఆర్కు మతిభ్రమించిందని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి కొండా సురేఖ ఎద్దేవా చేశారు. కేటీఆర్ మొదట తన తండ్రి కేసీఆర్ను అసెంబ్లీకి రప్పించి ఆ తర్వాత ఏది మాట్లాడినా బాగుంటుందన్నారు.
మామునూరు ఎయిర్పోర్ట్, కాకతీయ మెగాటెక్స్టైల్ పార్క్, భద్రకాళి చెరువు పూడికతీతతో పాటు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై గురువారం హనుమకొండలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో రివ్యూ నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
వరంగల్ నగరంలో చేపట్టిన పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎయిర్పోర్టు పనులు పూర్తి అయితే వరంగల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఎయిర్ పోర్టు రైతుల పరిహారం కోసం రూ.205 కోట్లు విడుదల చేశామని.. ఇప్పటికే రూ.34 కోట్ల పరిహారం చెల్లించినట్లు చెప్పారు. వరదలకు ఇండ్లు దెబ్బతిన్న వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ను అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం తిరుపతి జేఈవోతో మాట్లాడి సలహాలు తీసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీశ్ పాల్గొన్నారు
సీతక్కతో ఎలాంటి విభేదాలు లేవు
హైదరాబాద్, వెలుగు : మంత్రి సీతక్కతో తనకు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, భవిష్యత్లో కూడా రావని మంత్రి కొండా సురేఖ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాము సమ్మక్క -సారలమ్మ మాదిరి కలిసే ఉన్నామని, కడదాకా ఇదే విధంగా ఉంటామని స్పష్టం చేశారు. మంత్రి సీతక్క తనకు సోదరితో సమానమని, ఆమెతో ఉద్యమాల పేగు బంధమని పేర్కొన్నారు. కొందరు కావాలనే సంఘర్షణ వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు.