
కాశీబుగ్గ/ ఖిలా వరంగల్ (మామునూరు), వెలుగు: వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 21, 26వ డివిజన్లలో సీసీ రోడ్డు, డ్రైన్స్, కాశీబుగ్గ అర్బన్ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు హనుమకొండలోని రామ్ నగర్ లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
పలు సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. వరంగల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ ఆయూబ్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించగా, శనివారం రాత్రి ఆయూబ్ ఇంటికి మంత్రి కొండా సురేఖ వెళ్లి పరామర్శించారు. ఇదిలా ఉండగా, వరంగల్, హనుమకొండ జిల్లాల మధ్య ఉన్న అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధికి సహకరించాలని జాతర కమిటీ సభ్యులు మంత్రి కొండా సురేఖను కోరారు. కమిటీ ఆర్గనైజర్ దాసి రాందేవ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లకు సహకరించాలని వినతి పత్రం అందజేశారు. స్పందించిన మంత్రి వెంటనే అధికారులకు ఆదేశాలిచ్చారు.