కాంగ్రెస్ పార్టీ కప్పల తక్కెడ.. బీజేపీ మతతత్వ పార్టీ

కాంగ్రెస్ పార్టీ కప్పల తక్కెడ.. బీజేపీ మతతత్వ పార్టీ
  • జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల పర్యటనలో మంత్రి కేటీఆర్​
  • పలు అభివృద్ధి పనులు, నిర్మాణాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 

జగిత్యాల/రాజన్నసిరిసిల్ల, వెలుగు : వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తోందని ఐటీ, మున్సిపల్ మినిస్టర్  కేటీఆర్ విమర్శించారు. జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో పలు అభివృద్ధి పనులను మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్‌‌‌‌‌‌‌‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ గతంలో జగిత్యాల నుంచి మంత్రిగా పని చేసిన నాయకులు చేయలేని అభివృద్ధిని... ఒక్కసారే గెలిచిన ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌కుమార్ ​అంతకుమించి చేశారని పరోక్షంగా జీవన్ రెడ్డికి చురకలంటించారు.

బీజేపీ మతతత్వ పార్టీ అని.. గొడవలు పెంచి ఓట్లు వేయించుకోవాలని చూస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీని నమ్మే పరిస్థితి లేదని, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఓ ముసలి నక్క,  కప్పల తక్కెడ అంటూ మండిపడ్డారు.  మంత్రి కొప్పుల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌కుమార్ ​మాట్లాడుతూ రాష్ట్రంలో 4 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైన ఏకైక మున్సిపాలిటీ జగిత్యాలేనన్నారు. 

రూ. 330 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
 

జగిత్యాల జిల్లాలో సుమారు రూ.330 కోట్ల అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ​ప్రారంభించారు. రూ.38.4 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయ భవనాన్ని, జగిత్యాల అర్బన్ ప్రజల కోసం మల్యాల మండలం నూకపల్లిలో రూ.280కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను 3722 మందికి అందజేశారు.  రూ.4.50 కోట్లతో నిర్మించిన వెజ్-–నాన్ వెజ్ మార్కెట్‌‌‌‌ను ప్రారంభించారు.  ధర్మపురిలో ఎంసీహెచ్‌‌‌‌తోపాటు, 

పలు అభివృద్ధి పనుల పైలాన్‌‌‌‌ను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీలు భానుప్రసాద్, ఎల్.రమణ, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌రావు, రవిశంకర్, జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్​ వసంత, కలెక్టర్ యాస్మిన్ భాషా, ఎస్పీ భాస్కర్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్, జిల్లా లైబ్రరీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్,  మున్సిపల్ చైర్మన్లు, ఆఫీసర్లు పాల్గొన్నారు. 

గుడిసెల్లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

ఎన్నికలు రాగానే  ప్రజలు ఆగం కావద్దని, అభివృద్ధి చేసినోళ్లను గెలిపించాలని మంత్రి కేటీఆర్ అన్నారు.  రాష్ట్రంలో గుడిసెలేని నియోజకవర్గంగా సిరిసిల్లను మార్చుతానని, రాష్ట్రంలో ఒక్క రూపాయి లంచం లేకుండా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామన్నారు.  మంగళవారం సిరిసిల్ల కలెక్టరేట్‌‌‌‌లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక చేయూత, డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ, గృహలక్ష్మీ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీతో కలిసి  అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగు, తాగు, విద్యుత్, విద్య, వైద్య రంగాల్లో వచ్చిన మార్పులను అర్థం చేసుకోవాలన్నారు. జడ్పీ చైర్ పర్సన్ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్ పర్సన్లు జిందం కళా, మాధవి, పవర్ లూమ్, టెక్స్ టైల్ కార్పొరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, గడ్డం నర్సయ్య, చిక్కాల రామారావు పాల్గొన్నారు.