హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మంత్రి కేటీఆర్ ఆదివారం ట్వీట్ చేశారు. మంగళవారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని ఇచ్చిన హామీలను తన ట్వీట్లో గుర్తు చేశారు. వాటికి సంబంధించిన వార్తల క్లిప్పింగ్లను కూడా జత చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరికి 2022 నాటికి నివాస సదుపాయం కల్పిస్తామని 2018 జులైలో మోడీ హామీ ఇచ్చారు. 54 లక్షల ఇండ్లు దేశంలోని పేదలకు నిర్మించి ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైందని ప్రధానికి కేటీఆర్ గుర్తు చేశారు. 2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2018 జూన్లో మోడీ ప్రకటించారు. ఈ హామీని నిలబెట్టుకోవాలని కేటీఆర్ కోరారు. 2022 నాటికి దేశంలోని ప్రతి ఇంటికి తాగునీరు, కరెంట్, టాయిలెట్ వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. బుల్లెట్ ట్రైన్, ఎకానమీని రెట్టింపు చేసి ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుస్తానని పేర్కొన్నారు. ఈ హామీలన్నీ వచ్చే బడ్జెట్లో అమలు చేయాలని కోరారు. దేశానికి అత్యధిక ఆదాయం కల్పిస్తున్న నాలుగో రాష్ట్రమైన తెలంగాణకు బడ్జెట్లో తోడ్పాటునివ్వాలన్నారు. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు రూ.24 వేల కోట్ల సాయం అందించాలని కోరారు.
