
- ఈ విద్యా సంవత్సరం నుంచే యూజీ, పీజీ కోర్సులు : విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎర్త్ యూనివర్సిటీ ప్రపంచం గర్వించదగ్గ యూనివర్సిటీగా మారుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, కాలేజ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డితో పాటలు పలువురు ఆఫీసర్లతో బుధవారం ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ ప్రారంభోత్సవ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రారంభం, నిధుల సమీకరణ, ఫ్యాకల్టీ, కోర్సులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మరో మూడేండ్లలో పూర్తిస్థాయి విశ్వవిద్యాలయంగా మారనుందన్నారు. ఇలాంటి యూనివర్సిటీ ప్రపంచంలోనే మరెక్కడా లేదని చెప్పారు. యూనివర్సిటీ నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీలు వేసి, దేశ విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీలను సందర్శించి మౌలిక వసతులు, కోర్సుల రూపకల్పన, పరిశోధనలకు ప్రోత్సాహం, ఉద్యోగ అవకాశాలను పరిశీలించి అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని సూచించారు.
ఆగస్ట్లో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా యూనివర్సిటీని ప్రారంభించనున్నట్లు చెప్పారు. రూసా రూల్స్ ప్రకారం నిధుల సమీకరణకు ప్లాన్ చేయాలని సూచించారు. 300 ఎకరాల్లో మూడేండ్లలో శాశ్వత బిల్డింగ్లు, మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, ప్రొఫెసర్లుఘంటా చక్రపాణి, రాం వెంకటేశ్, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రన్, రూసా ప్రతినిధి జోసెఫ్, కలెక్టర్ జితేశ్ కుమార్, ఎస్పీ బి.రోహిత్ రాజు పాల్గొన్నారు.
ఈ ఏడాది నుంచే యూజీ, పీజీ కోర్సులు : విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా
ఎర్త్ సైన్సెన్స్ యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం నుంచే యూజీ, పీజీ కోర్సులు ప్రారంభం కానున్నాయని విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా చెప్పారు. మరో మూడేండ్లలో అన్ని కోర్సులను ప్రవేశపెడుతామని ప్రకటించారు. భూమికి సంబంధించిన అన్ని పరిశోధనలకు అవసరమైన కోర్సులను మొదలు పెడుతామన్నారు. సౌకర్యాలు, కోర్సుల అమలు కోసం మూడు కమిటీలు వేస్తున్నట్లు ప్రకటించారు.