మహబూబ్ నగర్, వెలుగు: ఉట్కూర్ ను క్రాసింగ్ స్టేషన్ గా అప్గ్రేడ్ చేసేందుకు రైల్వే అధికారులు అంగీకరించారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మక్తల్, నారాయణపేట, వికారాబాద్ పట్టణాలతో పాటు అనేక గ్రామాల ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్న వికారాబాద్–-కృష్ణ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు భూసేకరణ కోసం రాష్ట్ర మంత్రివర్గం రూ.438 కోట్లు కేటాయించిందని తెలిపారు.
122 కిలోమీటీర్ల రైల్వే లైన్ అలైన్మెంట్ లో భాగంగా ఉట్కూర్ స్టేషన్ ఒకటిగా గుర్తించబడిందని, దీనిని క్రాసింగ్ స్టేషన్గా అప్ గ్రేడ్ చేయడంతో 30 గ్రామాలకు చెందిన 60 వేల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఉపాధి, ఇతరత్రా అవసరాల కోసం వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించాడానికి వీలుగా ఉంటుందని చెప్పారు. ఉట్కూర్ రైల్వే స్టేషన్ను క్రాసింగ్ స్టేషన్ గా అప్ గ్రేడ్ చేయాలని కోరారు. దీనిపై జీఎం సానుకూలంగా స్పందించి అప్ గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జీఎం కోట్ల ఉదయ్ నాథ్, రైల్వే సెక్రటరీ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు యజ్ఞేశ్వర్ రెడ్డి, శివ పాల్గొన్నారు.
