
యూరియా కొరత వల్ల రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రైతులందరికీ యూరియా అందిస్తామన్నారు. మంచిర్యాలలో మీడియాతో మాట్లాడిన మంత్రి వివేక్...మేనేజ్ మెంట్ నిర్లక్ష్యం వల్లే రామగుండం ఫ్యాక్టరీకి ఈ దుస్థితి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ కు దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు వివేక్. చెన్నూరుకు 2 వేల టన్నుల యూరియా రావాల్సి ఉందన్నారు. చెన్నూరు నియోజకవర్గానికి రావలసిన యూరియా కోటా కంటే అదనంగా యూరియా ఇచ్చామన్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై అధికారులు నిఘా పెట్టాలని సూచించారు వివేక్. తప్పకుండా రైతులందరికీ యూరియా అందిస్తామని తెలిపారు.
పేదల కోసం సర్కార్ ఎన్నో పథకాలు తెచ్చిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సింగరేణి సంస్థను కాపాడుకునే బాధ్యత అందరిపైన ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే సింగరేణి లాభాల్లో నడుస్తోందని చెప్పారు. వచ్చిన లాభాలను కార్మికులకు పంచుతున్నామన్నారు.
అంతకు ముందు భీమారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అనంతరం మాట్లాడిన ఆయన ....గత ప్రభుత్వం నిరుపేదలను పట్టించుకోలేదన్నారు . భీమారం మండల ప్రజలు గత పది యేండ్లు ఆరోగ్య సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యా,వైద్యం పై ఫోకస్ పెట్టిందన్నారు. గ్రామాల్లో రోడ్లు,డ్రైనేజీలు,త్రాగు నీరు,మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజలు ఈ ఆరోగ్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.