ప్రేమగా చూస్తలేరని ఇంట్లో వాళ్లను చంపింది

ప్రేమగా చూస్తలేరని ఇంట్లో వాళ్లను చంపింది

చిత్రదుర్గ(కర్నాటక): ఇంట్లో వాళ్లు తనను ప్రేమగా చూస్తలేరని ఓ అమ్మాయి కుటుంబసభ్యులు తినే ఫుడ్ లో పురుగు మందు కలిపింది. ఈ ఘటన కర్నాటక చిత్రదుర్గ జిల్లా లంబనిహట్టిలోని ఇసముద్ర గ్రామంలో జులైలో జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామానికి చెందిన 17 ఏండ్ల అమ్మాయి మొదట అమ్మమ్మ, తాతయ్యల ఇంట్లో పెరిగింది. మూడేండ్ల క్రితం అమ్మానాన్నల దగ్గరికి వచ్చింది. ఆమెకు అన్న, ఒక చెల్లి ఉన్నారు. అయితే అన్నను, చెల్లినే ప్రేమగా చూస్తున్నారని అమ్మానాన్న, నానమ్మపై ఆమె కోపం పెంచుకుంది. దీంతో వాళ్లను చంపేందుకు ప్లాన్ వేసింది. జులై 12న రాత్రి రాగి ముద్దలు చేసిన ఆమె.. వాటిలో పురుగు మందు కలిపింది. వాటిని కుటుంసభ్యులకు పెట్టి తాను మాత్రం తినలేదు. తన చెల్లె వండిన అన్నం, రసం తిన్నది. రాగి ముద్దలు తిన్న అమ్మానాన్న, నానమ్మ, చెల్లెలు చనిపోయారు. ఆమె అన్న (19) మాత్రం బతికి బయటపడ్డాడు. ఆ ఘటన తర్వాత ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్​కు పంపించామని, ఫోరెన్సిక్ రిపోర్టులో అందులో విషం కలిసిందని తేలిందని పోలీసులు చెప్పారు. విచారణలో తనే పురుగుమందు కలిపినట్లు అమ్మాయి ఒప్పుకుందన్నారు.