
హోషియార్పూర్/బటిండా: ఇండియా, పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ కొనసాగుతున్న సమయంలో పంజాబ్లోని హోషియార్పూర్, బటిండాలో లోహ శకలాలు లభ్యమయ్యాయి. హోషియార్పూర్ లోని ఒక పొలంలో మిసైల్ శకలాల లాంటివి, బటిండాలోని రెండు ప్రాంతాల్లో కొన్ని గుర్తుతెలియని వస్తువులకు చెందిన లోహ శకలాలు గుర్తించినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. హోషియార్పూర్ ఎస్పీ ముకేశ్కుమార్ మాట్లాడుతూ గురువారం రాత్రి ఆకాశంలో పెద్ద పేలుళ్ల శబ్దాలు విన్నామని, లైట్లు మెరుస్తున్నట్లు చూశామని బటిండా వాసులు కొందరు పేర్కొన్నట్టు చెప్పారు.
ఇది ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలను కలిగించిందన్నారు. శకలాలు పడిన ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా గస్తీ పెట్టి ఇండియన్ ఎయిర్ఫోర్స్(ఐఏఎఫ్)కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఐఏఎఫ్ నుంచి ఒక టీమ్ ఘటనాస్థలానికి చేరుకొని వాటిని స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు. ‘‘గురువారం రాత్రి కొన్ని వస్తువులు మైదానంలో పడ్డాయి.
ఆ తరువాత పెద్దశబ్దంతో పేలుడు సంభవించింది. దీని వలన సమీపంలోని ఇంటి కిటికీలు, తలుపులు. పశువుల కొట్టం దెబ్బతిన్నాయి. ఆ వస్తువు పడిన దగ్గర మూడు అడుగుల గొయ్యి ఏర్పడింది” అని బటిండాకు చెందిన రైతు ఒకరు తెలిపారు.