
- డ్రాగన్ పై అమెరికా స్టేట్ మిస్సోరి దావా
వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలానికి చైనా యే కారణమంటూ నష్టపరిహారం కోరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా అమెరికా రాష్ట్రం మిస్సోరి చైనా నుంచి బిలియన్ డాలర్ నష్ట పరిహారం కోరుతూ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. లాక్ డౌన్ తో తమ రాష్ట్రం బిలియన్ డాలర్లు నష్టపోయిందని తెలిపింది. కావాలనే చైనా ప్రపంచాన్ని మోసం చేసిందని మిస్సోరి అటార్నీ జనరల్ ఎరిక్ ఆరోపించారు. కరోనా వ్యాప్తి, ప్రమాదం గురించి చైనా అబద్దాలు చెప్పింది. దీంతో కరోనా అన్ని దేశాలకు వ్యాపించింది. దీనికి చైనాయే బాధ్యత వహించాలి అని అన్నారు. మనిషి నుంచి మనిషి కి ఈ వైరస్ వ్యాపించదని చెప్పటంతో అన్ని దేశాలు మాట నమ్మి నష్టపోయాయని ఎరిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జర్మనీ సైతం తమకు చైనా పరిహారం ఇవ్వాలని కోరింది. అమెరికాకు చెందిన లాయర్ లారీ క్లేమన్ కూడా చైనా నుంచి 20 లక్షల కోట్ల డాలర్లు పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ కేసు దాఖలు చేశారు.