- ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి సూచించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ వరి క్వింటాల్ రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందించే సౌకర్యాలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
కందనూలు, వెలుగు : భవిష్యత్ తరాలకు ఉత్తమ విద్య అందించేందుకు గ్రామాల్లో విద్యావసతులు ఉండాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కుచుకుళ్ల రాజేశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని టీచర్లకు సూచించారు. జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా విద్యార్థులతో కేక్ కటింగ్ చేశారు. కార్యక్రమంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి, డైరెక్టర్ శరత్ చంద్రరెడ్డి, ఎంఈవో రఘునందన్ శర్మ, టీచర్లు పాల్గొన్నారు.
