
యాదాద్రి, వెలుగు: భువనగిరికి డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీ మంజూరైందని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. డిగ్రీ కాలేజీ కోసం 10 ఎకరాలను సేకరించనున్నట్లు చెప్పారు. భువనగిరి, -వలిగొండ మధ్య ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం 20 ఎకరాలు, భువనగిరి, పోచంపల్లి, వలిగొండలోని రెసిడెన్షియల్ స్కూల్స్కు పక్కా భవనాలు నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. భువనగిరిలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో షాపులను వీధి వ్యాపారులకు అలాట్ చేస్తామన్నారు.
నియోజకవర్గంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. భువనగిరిలోని డబుల్ బెడ్రూం ఇండ్లను అనర్హులకు కేటాయించారని, వాటిని రద్దు చేస్తామని తెలిపారు. బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల నిర్మాణం వేగంగా సాగుతోందని చెప్పారు. ఈ కాల్వలు పూర్తయితే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అంతకుముందు కలెక్టర్ హనుమంతరావుతో కలిసి వివిధ అంశాలపై రివ్యూ నిర్వహించారు. పోత్నక్ ప్రమోద్ కుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు ఉన్నారు.