వనపర్తి, వెలుగు: వనపర్తిలోని బీఆర్ఎస్ నేత అవినీతి, అక్రమాలను ఒక్కొక్కటిగా బయటి తీశామని, సారును జైలుకు తప్పక పంపుతామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వనపర్తిలో రూ.256 కోట్లతో నిర్మించి 500 పడకల ఆస్పత్రికి భూమి పూజ చేశారు.
అనంతరం మాట్లాడుతూ..మాందాపూరులోని సారు గెస్ట్ హౌజ్కు ఫ్రీ కరెంట్ తీసుకుంటే కట్ చేయించామని, వెల్టూరులో 50హెచ్పీ మోటారుతో అక్రమంగా నీటిని తోడుతుంటే ఆపామని, గద్వాలలో కృష్ణానది పక్కన 2.20 ఎకరాల భూమిని కబ్జా చేస్తే గద్వాల కలెక్టర్తో చెప్పి సర్వే చేయించి ఫెన్సింగ్ వేయించామన్నారు.
ఆయన మీద, ఆయన దత్తపుత్రుల మీద ఎఫ్ఆర్ఐ చేయించామని, ఇన్కం టాక్స్ ఎఫ్ఆర్ఐ చేయించామని పేర్కొన్నారు. తాను 23 నెలల్లో చేసిన అభివృద్ధిపైన, ఆరోపణలపై చర్చకు రమ్మని పిలిస్తే ఆయన కానీ ఆయన శిష్యులు కాని రాలేదన్నారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్, కూతురు కవిత, మేనల్లుడు హరీశ్, ఆయన సడ్డకుడు సంతోష్ కలిసి రూ.లక్ష కోట్లు సంపాదించారని చెప్పామని పంపకాల్లో భాగంగానే కవితను బయటకు తోశారని ఆరోపించారు.
వనపర్తిలో ఒకరు అభివృద్ధి పేరుతో పట్టణాన్ని ధ్వంసం చేసి అందరి పై కేసులు పెట్టించారని విమర్శించారు. ఆయన అవినీతి అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్, సీబీఐకి ఫిర్యాదు చేశామని, తప్పులు బయటపడితే జైలుకు పోవుడు ఖాయమని, చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తామని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్రెడ్డి 2023, మార్చి 2న ఫౌండేషన్ వేసిన పనులకు డీపీఆర్ టెండర్స్ పూర్తి చేశామన్నారు.
ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారని, ఇప్పటికీ అవకాశముందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీకి, అసెంబ్లీలో ఆపోజిషన్ లీడర్ పదవిని ఎస్సీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కవిత చేసిన ఆరోపణలు తప్పయితే మాజీ మంత్రి వనపర్తిలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, బీచుపల్లిలోని ఆంజనేయ ఆలయానికి వెళ్లి ప్రమాణం చేసి తప్పని చెప్పాలని డిమాండు చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు చీర్ల చందర్, సతీశ్, రహీం, కృష్ణ పాల్గొన్నారు.
