ఫోన్ల రేట్లు పెరుగుతాయ్
జీఎస్టీ 18 శాతానికి పెంపు అగ్గిపుల్లలపై తగ్గింపు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా మొబైల్ ఫోన్ల సప్లై తగ్గుతుందనే అంచనాలు ఉండగా, వీటిపై జీఎస్టీని ప్రభుత్వం 12 నుంచి 18 శాతానికి పెంచింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన 39వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొబైల్ ఫోన్లతోపాటు వీటి విడిభాగాలపైనా జీఎస్టీని 18 శాతానికి పెంచారు. చేతితో /యంత్రంతో తయారు చేసే అగ్గిపుల్లలపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించారు. విమానాల మెయింటనెన్స్ రిపేర్ ఓవర్ హాల్ సేవలపై జీఎస్టీని 18 శాతం నుంచి ఐదుశాతానికి తగ్గించారు. కొత్త జీఎస్టీ రేట్లు ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయి. ఇక నుంచి జీఎస్టీ చెల్లింపు ఆలస్యమైతే కట్టాల్సిన మొత్తంపై జూలై నుంచి వడ్డీ వేయాలని సమావేశం నిర్ణయించింది. ఎంఎస్ఎంఈలు జీఎస్టీఆర్ 9సీ రూపంలో ఇవ్వాల్సిన రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ను అందజేయాల్సిన తేదీని పొడగించారు. ఏడాది టర్నోవర్ రూ.ఐదు కోట్ల వరకు ఉన్న కంపెనీలు ఈ ఏడాది జూన్ లోపు ఈ స్టేట్మెంట్ను అందించాలి. 2018, 2019 ఆర్థిక సంవత్సరాలకు వార్షిక రిటర్నులు ఆలస్యంగా అందించిన కంపెనీలకు లేటుఫీజు రద్దు చేస్తామని మండలి హామీ ఇచ్చింది. అయితే రూ. రెండు కోట్లలోపు ఏడాది టర్నోవర్ ఉన్న కంపెనీలకు మాత్రమే మినహాయింపు వర్తిస్తుంది. రూ.ఐదు కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న ట్యాక్స్పేయర్లు కచ్చితంగా జీఎస్టీ రిటర్నులు అందజేయాలి. ఎరువులు, జౌళి, ఫుట్వేర్పై జీఎస్టీని పెంచాలన్న ప్రపోజల్పై మండలి నిర్ణయం తీసుకోలేదు.
For More News..