- 5 శాతం శ్లాబు 7 శాతానికి.. 18 శాతం శ్లాబు 20 శాతానికి పెంపుదల
- ప్రభుత్వానికి అదనంగా ఏటా రూ. 3 లక్షల కోట్ల ఆదాయం!
- రెవెన్యూ లోటు పూడ్చుకోవడానికి కసరత్తు
వెలుగు బిజినెస్ డెస్క్: శ్లాబులలో మార్పు ద్వారా జీఎస్టీ ఆదాయం ఏటా మరో రూ. 3 లక్షల కోట్లు పెరిగేలా కమిటీ ప్రపోజ్ చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. 5 శాతం శ్లాబును 7 శాతానికి, 18 శాతం శ్లాబును 20 శాతానికి పెంచాలని జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన కమిటీ తన ప్రపోజల్స్లో చెప్పినట్లు పేర్కొన్నారు. అదనంగా వచ్చే జీఎస్టీ ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు పంచుకుంటాయి. పెట్రోలు, డీజిల్లపై ఇటీవల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ఈ లోటును పూడ్చు కోవడానికి జీఎస్టీ శ్లాబుల రేటు పెంపుదల సాయపడుతుంది. వెల్ఫేర్ స్కీముల కోసం మరింత వెచ్చించే వెసులుబాటు కూడా ప్రభుత్వానికి దొరుకుతుంది. వచ్చే ఏడాది జూన్ నుంచి రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న జీఎస్టీ కాంపెన్సేషన్ నిలిచిపోనుంది. దీంతో వాటికీ ఈ అదనపు ఆదాయం అండగా మారనుంది. ఆదాయ వనరులు తగినంతగా లేక చాలా రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి.
మెరిట్ రేటు 6 శాతమైతే అదనంగా రూ. 50 వేల కోట్లు...
గుజరాత్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలు భారీగా జీఎస్టీ కాంపెన్సేషన్ను పొందుతున్నాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో కొవిడ్–19 సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో ఖర్చులు పెరగడం వల్ల అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలూ చిక్కుల్లో పడ్డాయి. రెవెన్యూ తగినంతగా రాక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఖర్చుకూ–ఆదాయానికీ మధ్య లోటు పూడ్చడానికి అదనంగా అప్పులు చేసే పరిస్థితీ లేదు. వ్యక్తిగత ఇన్కంటాక్స్ రేట్లు, పెట్రోల్–డీజిల్లపై ఎక్సైజ్ డ్యూటీలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తగ్గించింది. ఇక ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం ముందున్న ఒకే మార్గం జీఎస్టీ పెంచడమని ఆ ప్రభుత్వాధికారి చెప్పారు. జీఎస్టీ 5 శాతం శ్లాబును (మెరిట్ రేటు) 6 శాతానికి పెంచితే ఏటా అదనంగా రూ. 40 వేల కోట్ల నుంచి రూ. 50 వేల కోట్లు సమకూరుతుందని పేర్కొన్నారు. చాలా ఎసెన్షియల్ ఐటమ్స్పై ఈ మెరిట్ శ్లాబునే విధిస్తున్నారు.
ఏప్రిల్ 1, 2022 నుంచి అమలులోకి తెండి....రాష్ట్రాల సూచన
విలువైన మెటల్స్పై విధిస్తున్న జీఎస్టీ రేటు, చిన్న వ్యాపారాలకు ఇస్తున్న కాంపెన్సేషన్ స్కీము వంటి వాటి రివిజన్ కూడా ఈ ప్రపోజల్స్లో ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ కొత్త శ్లాబులను అమలులోకి తెస్తే మేలని కొన్ని రాష్ట్రాలు సూచిస్తున్నాయని పై ప్రభుత్వాధికారి వెల్లడించారు. జీఎస్టీ శ్లాబుల రివిజన్ ప్రపోజల్స్ వివరాల కోసం ఫైనాన్స్ మినిస్ట్రీకి పంపిన ఈమెయిల్స్కు జవాబు రాలేదని మింట్ ఈ కథనంలో పేర్కొంది. 2017లో జీఎస్టీని అమలులోకి తెచ్చిన తర్వాత చాలా వస్తువులపై పన్నును జీఎస్టీ కౌన్సిల్ తగ్గించింది. జీఎస్టీ రాకతో పన్నుల వ్యవస్థలో ట్రాన్సపరెన్సీ బాగా పెరిగింది. కానీ, జీఎస్టీ ప్రభావంతో పరోక్ష పన్నుల వసూళ్లు తగ్గిపోయాయి.
ఫైనల్ డెసిషన్ కాలేదు...
జీఎస్టీ శ్లాబుల పెంపు విషయంలో తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని మరో సీనియర్ అధికారి చెప్పారు. కౌన్సిల్ డిస్కషన్స్లో ఈ అధికారి కూడా పాల్గొన్నారు. శ్లాబుల రేషనలైజేషన్పై చర్చ జరుగుతోందని, అమలులోకి తేవాలంటే మరి కొంత స్టడీ అవసరమనే ఆలోచన కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. పెద్ద మార్పులు చేసేప్పుడు తొందరపడకూడదని చెప్పారు. మంత్రుల కమిటీ ఈ అంశాన్ని ఇంకా పరిశీలిస్తుండటంతో తన పేరును చెప్పడానికి ఈ అధికారి ఇష్టపడలేదు. జీఎస్టీ శ్లాబుల మార్పు కోసం కర్నాటక ముఖ్యమంత్రి బొమ్మై నాయకత్వంలో ఒక కమిటీని జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఈ మేరకు కొన్ని ప్రపోజల్స్ను తయారు చేసి ఆ కమిటీకి శనివారం అందచేశారు.