
- తండ్రి, మరో కూతురికి గాయాలు
- గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో ప్రమాదం
- మృతులు మేడ్చల్ జిల్లా నిజాంపేటకు చెందిన వారు
అలంపూర్, వెలుగు : హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో తల్లీ కూతురు చనిపోగా, తండ్రి, మరో కూతురికి గాయాలయ్యాయి. ఈ ఘటన గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాల గ్రామ శివారులోని 44వ నంబర్ హైవేపై శుక్రవారం ఉదయం జరిగింది. ఇటిక్యాల ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం... మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేటకు చెందిన వెంకటబాబ్జి, భార్య ఎర్ర శ్రావణి (38), కూతుర్లు సాయిచైత్ర (7), లక్ష్మీ సహస్రతో కలిసి ఈ నెల 24న కారులో ఊటీకి వెళ్లి శుక్రవారం తిరిగి వస్తున్నారు.
ఈ క్రమంలో గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాల గ్రామ సమీపంలోకి రాగానే హైవేపైన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రావణి అక్కడికక్కడే చనిపోగా, వెంకట బాబ్జి, సాయిచైత్ర, లక్ష్మీ సహస్ర తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని హైవే అంబులెన్స్లో కర్నూల్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ సాయిచైత్ర చనిపోయింది. వెంకట బాబ్జి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.