
- ఆఫీసర్లపై ఎంపీ రఘునందన్ రావు ఫైర్
సిద్దిపేట, వెలుగు: ఇరిగేషన్ పనులపై ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశాలు నిర్వహించరా? ఇరిగేషన్ అధికారులు వందల కోట్ల అవినీతి సొమ్ముతో దొరుకుతారు.. కానీ, పనుల ప్రగతిపై మాట్లాడరు. అధికారుల తీరు దున్నపోతుపై వర్షం పడినట్లు ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. బుధవారం రంగనాయక సాగర్ ఎస్ఈ ఆఫీస్లో ఇర్కోడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 2022లో పనులకు శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు ఎందుకు సాగు నీరివ్వలేదని, ప్రజాప్రతినిధులతో ఎందుకు మీటింగ్ నిర్వహించలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకొని అధికారులు పని చేయడం లేదని, రేపటి నుంచి ఫీల్డ్ లో ఉండాలని ఆదేశించారు.
మల్లన్నసాగర్ లోని 12వ ప్యాకేజీలో తలాపున గోదావరి ఉన్నా రైతులకు నీరు అందడం లేదన్నారు. 30 రోజుల్లో రైతులకు నీరు అందేలా పనులు చేయాలని, ఆగస్ట్ 15న వరకు పనులు పూర్తి చేయకుంటే మాటలు ఉండవు.. చేతలు ఉంటాయని హెచ్చరించారు. ఇరిగేషన్ ఎస్ఈ బస్వరాజు మాట్లాడుతూ మల్లనసాగర్ 12 ప్యాకేజీ పనులపై రివ్యూ చేసి త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని తెలిపారు. మెయిన్ పైప్ లైన్ 99 శాతం పని పూర్తయిందని చెప్పారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇరిగేషన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.