
- లోకల్ లీడర్లు నారాజ్
- మీటింగ్లకు డుమ్మా కొడుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు
- ఎమ్మెల్యే ఫోన్ చేసినా స్పందించని ఎంపీటీసీలు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో చాలా చోట్ల కింది స్థాయి ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధుల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతున్నాయి. వివిధ స్కీమ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక, అభివృద్ధి పనులప్రతిపాదనల్లో తమకు తగిన ప్రయార్టీ ఇవ్వకుండా ఎమ్మెల్యేలే నేరుగా సెలక్ట్ చేస్తున్నారని కింది స్థాయి లీడర్లు నారాజ్గా ఉన్నారు. బహిరంగంగా ఈ విషయం చెబితే ఎమ్మెల్యేల నుంచి సమస్యలు వస్తాయన్న భయంతో లోలోన రగిలిపోతున్నారు. కానీ, సందర్భాన్ని బట్టి ఈ విషయం ముఖ్య నేతలకు తెలిసేలా వ్యవహరిస్తున్నారు.
ఎమ్మెల్యే వచ్చినా రాని సభ్యులు
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండల జనరల్ బాడీ మీటింగ్ఈనెల 18న జరిగింది. స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. నిర్ణీత టైం కంటే చాలా సేపు ఎదురు చూసినా మెజార్టీ సభ్యులు రాలేదు. ఎంపీపీ రాధ, వైస్ ఎంపీపీ బజన్లాల్తో పాటు పాటు మరో ఇద్దరు ఎంపీటీసీలు మాత్రమే హాజరయ్యారు. మీటింగ్ ప్రారంభించాలంటే కోరం ఉండాలి. ఇక్కడ మొత్తం 15 మంది ఎంపీటీసీలు ఉంటే ఇందులో 13 మంది అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్లు కాగా.. మిగతా ఇద్దరు కాంగ్రెస్కు చెందిన వారు. 15 మంది సభ్యుల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీతో పాటు మరో ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. కొందరు సభ్యులకు స్వయంగా ఎమ్మెల్యే ఫోన్చేసి మీటింగ్కు రమ్మని పిలిచినట్లు తెలిసింది. అధికార పార్టీకి చెందిన సభ్యులు చాలా సేపటికీ కూడా రాకపోవడంతో చివరకు కాంగ్రెస్పార్టీకి చెందిన ఎంపీటీసీ హాజరు కావడంతో కోరం సరిపోయింది. ఆ తర్వాత మీటింగ్ నిర్వహించారు. అతను కూడా కూడా రాకపోయి ఉంటే మీటింగ్ను వాయిదా వేయాల్సి వచ్చేది. సర్పంచులు కూడా చాలా మంది రాలేదు. ఎమ్మెల్యే వచ్చిన కూడా అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీలు హాజరు కాకపోవడం పార్టీలో ఆసక్తిగా మారింది.
పార్టీ మారకుండా కట్టడి..
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఓ మండల స్థాయి ప్రజాప్రతినిధి ఇటీవల పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. తగిన ప్రయార్టీ లేకపోవడం, పరిస్థితుల ప్రభావంతో ఆయన కొంత నారాజ్ అయినట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ లీడర్ ఆ ప్రజాప్రతినిధిని తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ఇదే మండలానికి చెందిన అధికార పార్టీకి చెందిన ఓ లీడర్రంగంలోకి దిగి సదరు ప్రజాప్రతినిధితో చర్చలు జరిపి తమ పార్టీలోనే కొనసాగేలా చూసినట్లు తెలిసింది. కింది స్థాయిలో ప్రజాప్రతినిధులు నారాజ్ అవుతున్న విషయాన్ని గ్రహించిన ఇటీవల ఎమ్మెల్యే కొందరితో మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే గాంధారి మండలంలోని మెజార్టీ ఎంపీటీలు మీటింగ్కు హాజరు కాకపోవడంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఎంపీటీలతో మాట్లాడాలని మండలానికి చెందిన కొందరు లీడర్లకు ఎమ్మెల్యే బాధ్యత అప్పగించారు.