ఎన్సీబీ పంచనామా: షారుఖ్ కొడుకు డ్రగ్స్ తీసుకున్నాడు

ఎన్సీబీ పంచనామా: షారుఖ్ కొడుకు డ్రగ్స్ తీసుకున్నాడు

ముంబై క్రూయిజ్ షిప్‌ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఆ షిప్‌లో జరిగిన పార్టీలో డ్రగ్స్ వాడాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) తన పంచనామా రిపోర్టులో స్పష్టం చేసింది. ఆర్యన్ ఆ షిప్‌లో గంజాయి తీసుకున్నాడని.. అతడి ఫ్రెండ్ అర్బాజ్ మర్చెంట్ దగ్గర నిషేధిత డ్రగ్స్ దొరికాయని ఎన్సీబీ పేర్కొన్నట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా ప్రచురించింది. గత ఆదివారం షిప్‌లో పార్టీ జరగుతుండగా పక్క సమాచారంతో ఎన్సీబీ ఆఫీసర్లు రైడ్ చేశారు. రైడ్ చేసిన సమయంలో అక్కడ సీన్ ఏంటి? షిప్‌లోకి వెళ్లాక ఏం చేశారన్న వివరాలతో అధికారులు పంచనామా రాశారు. షిప్‌లో రైడ్ తర్వాత ఆర్యన్ ఖాన్, అర్బాజ్‌లను గెజిట్ ఆఫీసర్ల ఎదుట వాళ్లను సెర్చ్ చేయాల్సి ఉంటుందని చెబితే, వాళ్లిద్దరూ అందుకు ఒప్పుకోలేదని అందులో పేర్కొన్నారు. అయితే డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే షూలో చారస్ దాచినట్లు అర్బాజ్ చెప్పాడని వెల్లడించారు. అతడి దగ్గర నుంచి ఆరు గ్రాముల రికవరీ చేసినట్లు పంచనామాలో నమోదు చేశారు. ఆర్యన్‌తో పాటు తాను డ్రగ్స్ తీసుకున్నట్లు అర్బాజ్ చెప్పాడని, షిప్‌లో ఎంజాయ్ చేద్దామని వచ్చామని చెప్పారని ఎన్సీబీ పేర్కొంది. ఆ తర్వాత ఆర్యన్‌ను ప్రశ్నించడంతో అతడు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడని రిపోర్ట్‌లో రాశారు అధికారులు. ఈ పంచనామాను ప్రైవేట్ డిటెక్టివ్ కిరణ్ గోసవి, ప్రభాకర్ గోఘోజీ సేన్‌ల ఎదుట రికార్డ్ చేసినట్లు ఎన్సీబీ వర్గాలు తెలిపాయి.

రైడ్ సమయంలో  కేపీ గోసవితో పాటు మొత్తం 9 మంది సాక్ష్యులు ఉన్నారని ఎన్సీబీ డిప్యూటీ డీజీ జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. షిప్‌లో అదుపులోకి తీసుకున్న నిందితులు ఇంటరాగేషన్‌లో వెల్లడించిన విషయాల ఆధారంగా ముంబైలోని వేర్వేరు ప్రాంతాల్లో మరో పది మందిని అరెస్టు చేశామని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

హైదరాబాద్‌లో భారీ వర్షానికి రెస్టారెంట్‌లోకి వరద

యాదగిరిగుట్ట: పిల్లి పోయిందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

మొక్కలు నరికినందుకు రూ.50 వేలు ఫైన్