
ముంబై: ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)–2023 సెషన్ కు ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది. బీజింగ్లో జరిగిన 139వ ఐఓసీ సెషన్లో ఇండియా బృందం ఓ ప్రెజెంటేషన్ ఇచ్చి మెంబర్స్ ను ఒప్పించింది. ఇందులో ఐఓసీ మెంబర్ నీతా అంబానీ, ఇండియా ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరీందర్ బాత్రా, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో పాటు 2008 ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్ అభినవ్ బింద్రా పాల్గొన్నారు. చివరిసారిగా 1983లో ఢిల్లీలో ఈ సెషన్ ను నిర్వహించారు. దీంతో దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ విశిష్ట ఆతిథ్య అవకాశం ఇండియాకు వచ్చింది. ‘40 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత ఇండియాకు ఒలింపిక్ సెషన్ ను హోస్ట్ చేసే అవకాశం దక్కింది. ఈ సెషన్ ఆతిథ్యానికి ముంబైకి అవకాశం ఇచ్చినందుకు ఐఓసీకి థ్యాంక్స్. ఇండియా స్పోర్ట్స్ లో ఇది కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ఆశిస్తున్నా’ అని ఐఓసీ మెంబర్ నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు.