ఉదయం 8 గంటల నుంచి మునుగోడు ఓట్ల లెక్కింపు

ఉదయం 8 గంటల నుంచి మునుగోడు ఓట్ల లెక్కింపు
  • తొలి అద్దగంట పోస్టల్​ బ్యాలెట్లు.. ఆ తర్వాత ఈవీఎంలు
  • మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి ఫలితం
  • ముందుగా చౌటుప్పల్, చివరిగా నాంపల్లి మండలాల ఓట్ల కౌంటింగ్​
  • 21 టేబుళ్లు 15 రౌండ్లు

నల్గొండ / హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు బై పోల్​ ఫలితం మరికొద్ది గంటల్లో వెల్లడికానుంది. మొత్తం 47 మంది బరిలో నిలువగా.. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, టీఆర్​ఎస్​ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి, కాంగ్రెస్​ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నడుమ పోటీ నడిచింది. మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,25,192 మంది ఓటు వేశారు. పోలింగ్​(పోస్టల్​బ్యాలెట్​ ఓట్లు కలుపుకొని) 93.41 శాతం నమోదైంది. నల్గొండలోని ఆర్జాలబావి ఎఫ్​ సీఐ గోదాంలో ఆదివారం ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్​రూమ్​కు ఉదయం 7.30 గంటలకు అబ్జర్వర్లు, అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో సీల్​ తొలగిస్తారు. ఇక్కడి నుంచి ఈవీఎంలను ఉదయం 8 గంటలకు ఎఫ్​సీఐ గోదాంలోని కౌంటింగ్ హాల్​కు తీసుకొస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్​ ఓట్లను లెక్కిస్తారు. 739 పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లకుగాను 686 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్​ఓట్ల లెక్కింపు కోసం రెండు టేబుళ్లు ఏర్పాటు చేశారు.  

8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల కౌంటింగ్​..

ఉదయం 8 గంటలకు పోస్టల్​ ఓట్లను లెక్కిస్తామని, ఆ తర్వాత అరగంటకు అంటే ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలవుతుందని  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్​రాజ్​ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 21 టేబుళ్లను ఏర్పాటు చేసి 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈవీఎంల  కౌంటింగ్ పూర్తయిన తర్వాత, వీవీప్యాట్లలో  ఉన్న స్లిప్పులు ర్యాండమ్​గా ఐదు తప్పనిసరిగా చెక్​ చేస్తామన్నారు. 

298 పోలింగ్​ స్టేషన్లు..

నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. చౌటుప్పల్ మండలంలో 1 నుంచి 68, సంస్థాన్​ నారాయణపురం మండలంలో 69 నుంచి 122, మునుగోడు మండలంలో 123 నుంచి 141.. అదేవిధంగా 144 నుంచి 168 పోలింగ్​ స్టేషన్లు ఉన్నాయి. చండూరు మండలంలో 169 నుంచి 178, మళ్లీ 188 నుంచి 217 పోలింగ్​ స్టేషన్లు ఉన్నాయి. 
గట్టుప్పల్​ మండలంలో 142, 143, 179 నుంచి 187తోపాటు 218 నుంచి 222, మర్రిగూడ మండలంలో 223 నుంచి 255, నాంపల్లి మండలంలో 256 నుంచి 298 పోలింగ్​ స్టేషన్లు ఉన్నాయి. మునుగోడు, చండూరు, సంస్థాన్​ నారాయణపురం మండలాల్లో పోలింగ్​ కేంద్రాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ మండలాల్లో ఓట్ల లెక్కింపు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 

మూడంచెల భద్రత

ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 250 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో  వంద మంది ఓట్ల లెక్కింపు చేపడుతారు. మరో 150 మందిని ఇతర కార్యక్రమాల కోసం నియమించారు. కౌంటింగ్​ కేంద్రం వద్ద 144 సెక్షన్​ విధించారు. లెక్కింపు టైంలో మూడం చెల భద్రతను ఏర్పాటు చేసినట్లు సీఈవో వికాస్​రాజ్​ తెలిపారు. లోపల కేంద్ర బలగాలు, బయట రెండంచెల్లో రాష్ట్ర పోలీసుల భద్రత ఉంటుందని వివరించారు.

మొదటి రౌండ్​ ఫలితం 9.15 గంటలకు..!

నియోజకవర్గంలో ఫస్ట్ పోలింగ్​ స్టేషన్ చౌటుప్పల్​ మండలం నుంచి మొదలవుతుంది. కాబట్టి ఓట్ల లెక్కింపు కూడా ఈ మండలం నుంచే స్టార్ట్​ చేస్తారు. చౌటుప్పల్​ మండలంలో మొత్తం 1 నుంచి 68 నెంబర్​ వరకు పోలింగ్​ స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో రౌండ్​లో 21 పోలింగ్​ స్టేషన్ల ఓట్లను లెక్కిస్తారు. 47 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఒక్కో రౌండ్​ ఫలితం రావడానికి కనీసం అద్దగంట నుంచి 40 నిమిషాల టైం పట్టొచ్చని అధికారులు తెలిపారు.  అంటే మొదటి రౌండ్​ ఫలితం ఉదయం 9.15 గంటల వరకు వచ్చే అవకాశం ఉంది. చివరిగా నాంపల్లి మండలం ఓట్లు లెక్కిస్తారు. మొత్తం 298 పోలింగ్​ స్టేషన్లు ఉండగా.. ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2గంటల వరకు పూర్తయ్యే అవకాశం ఉందని ఎన్నికల రిటర్నింగ్​ అధికారి రోహిత్​ సింగ్​ చెప్పారు. 

భారీ బందోబస్తు: ఎస్పీ రెమా రాజేశ్వరి

నల్గొండ అర్బన్‌‌‌‌, వెలుగు: కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా చర్యలు తీసుకుంటు న్నట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. శనివారం కౌంటింగ్​ కేంద్రం వద్ద ఎస్పీ మాట్లాడుతూ.. 470 మంది పోలీస్ సిబ్బంది మూడు కేంద్ర కంపెనీ బలగాలతో భద్రత ఏర్పాట్లు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని, కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చే అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ల వాహనాల కోసం  లక్ష్మీగార్డెన్స్​ వద్ద పార్కింగ్​ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల అధికారులు ఏర్పా టు చేసిన బస్సుల్లో కౌంటింగ్ సెంటర్ వద్దకు రావాలని చెప్పారు. కౌంటింగ్ సెంటర్​కు వచ్చే అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారి జారీచేసిన గుర్తింపు కార్డులు తీసుకురావాలన్నారు. 

మండలాల వారీగా పోలింగ్

మండలం    మొత్తం ఓటర్లు    పోలైన ఓట్లు 
చౌటుప్పల్​    59,433    55,678
సంస్థాన్​ నారాయణపురం    36,430    34,157
మునుగోడు    35,780    33,455
చండూరు    33,509    31,333
గట్టుప్పల్    14,525    13,452
మర్రిగూడ    28,309    25,877
నాంపల్లి    33,819    31,240