
- ఈనెల12న నాగార్జునసాగర్ సందర్శన
- పనుల బిజీలో వివిధ శాఖల అధికారులు
హాలియా, వెలుగు: హైదరాబాద్ లో నిర్వహిస్తోన్న మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ ముస్తాబవుతోంది. 40 దేశాలకు చెందిన మిస్వరల్డ్ కంటెస్టెంట్స్ఈనెల12న బుద్ధవనాన్ని సందర్శించేందుకు సాగర్ కు వస్తున్నారు. దీంతో విజయ విహార్ ను అధికారులు సుందరీకరిస్తున్నారు. ఇందుకు రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నెల రోజులుగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
మిస్వరల్డ్ కంటెస్టెంట్స్ ముందుగా బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి, మహాస్థూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో ధ్యానం చేశాక జాతకవనంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుద్ధవనం ప్రవేశద్వారం నుంచి మహాస్థూపం వరకు విద్యుత్ లైట్లతో ప్రత్యేకంగా అలంకరి స్తున్నారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిత్యం పర్యవేక్షిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
వారం కింద మల్టీ జోన్–2 ఐజీ సత్యనారాయణ, ఎస్పీ శరత్ చంద్ర పవార్ సాగర్ ను సందర్శించి భద్రతా చర్యలపై చర్చించారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా సుమారు1500 మంది పోలీసులతో భారీ బందోస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నెస్పీ, రెవెన్యూ ఫారెస్ట్, అగ్నిమాపక శాఖలు కూడా తమవంతు సహాయసహకారాలు అందిస్తున్నాయి. మిస్వరల్డ్ కంటెస్టెంట్స్ పర్యటన ఏర్పాట్లలో వివిధ శాఖల అధికారులు బిజీబిజీగా ఉన్నారు.