సాగర్‌‌కు కొనసాగుతున్న వరద 26 గేట్ల నుంచి నీటి విడుదల

సాగర్‌‌కు కొనసాగుతున్న వరద  26 గేట్ల నుంచి నీటి విడుదల

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్‌‌కు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌‌కు 1,72,774 క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తుండడంతో 26 క్రస్ట్‌‌ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 2,34,850 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రం 6 గంటలకు వరకు 587.60 అడుగులకు (305. 8626 టీఎంసీల) చేరుకుంది. 

సాగర్‌‌ నుంచి ఏఎమ్మార్పీకి 1,800 క్యూసెక్కులు, విద్యుత్‌‌ ఉత్పత్తికి 28,339 క్యూసెక్కులు కలిపి మొత్తం 2,71,596  క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదలను నిలిపి వేశారు.

డిండికి జలకళ 

డిండి, వెలుగు : వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దుందుభి వాగు ఉధృతంగా పారుతోంది. దీంతో డిండి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండడంతో అలుగుపారుతోంది. డిండి ఎడమ కాల్వ ద్వారా ఆయకట్టుకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి డిండి ప్రాజెక్ట్‌‌లోకి 4,200 క్యూసెక్కులు వరద వస్తున్నట్లు ఇరిగేషన్ ఏఈ పరమేశ్‌‌ తెలిపారు.