
- మధ్యలో నలిగిపోతున్న కాంగ్రెస్ లీడర్లు
- ఆశావహులకు సహకరించొద్దని హెచ్చరికలు
- ఎన్నికల ప్రచారం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనద్దని హుకుం
- డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ను మందలించిన సీనియర్ నేత
- నియోజకవర్గాల్లో రచ్చకెక్కుతున్న విభేదాలు
నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కేడర్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. హైకమాండ్ చెప్పినట్టు నడుచుకోవాలా? సీనియర్ల డైరక్షన్ ఫాలో కావాలో అర్థంకాక మధ్యలో నలిగిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న పలువురు ఆశావహులు ఇప్పటికే పీసీసీ చీఫ్ ఆదేశాల మేరకు ఎన్నికల క్యాంపెయిన్ షురూ చేశారు. టికెట్ వస్తుందన్న నమ్మకంతో పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు.
కానీ, వీరు ప్రచారం చేయకుండా సీనియర్లు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. వెంట తిరిగే కీలక నేతలు, క్యాడర్కు ఫోన్లు చేసి మరీ వారికి సపోర్ట్ చేయొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరైనా తమ ఆదేశాలు ధిక్కరిస్తే లోకల్ కేడర్ను అడ్డంపెట్టుకుని దాడులకూ వెనకాడడం లేదని విమర్శలు ఉన్నాయి. నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సూర్యాపేట, ఆలేరు, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో సైతం దాదాపు ఇవే పరిస్థితులు నెలకొన్నాయి.
డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్కు హెచ్చరిక..
మునుగోడు టికెట్ఆశిస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గీయుడు చల్లమల కృష్ణారెడ్డి చేపట్టిన పాదయాత్రలో డీసీసీ ప్రెసిడెంట్శంకర్ నాయక్ పాల్గొనడం పట్ల ఓ సీనియర్ నేత మందలించినట్లు తెలిసింది. కృష్ణారెడ్డి యాత్రకు పోవద్దని, ఆయనకు సహకరించొద్దని హుకుం జారీచేసినట్లు సమాచారం. అయితే శంకర్ నాయక్ కూడా ఆ లీడర్కు గట్టిగానే కౌంటర్ఇచ్చినట్లు తెలిసింది.
పీసీసీ ఆదేశాల మేరకే యాత్రలో పాల్గొన్నానని, ప్రజలు, పార్టీ కష్టపడి ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గాల్లో లేనిపోని గొడవలు సృష్టిస్తున్నారని గట్టిగానే బదులు ఇచ్చారట. ఈ సంఘటన గురించి శంకర్ నాయక్ తన రాజకీయ గురువు కె.జానారెడ్డికి ఫిర్యాదు చేసినట్లు పార్టీ ముఖ్యనేత ఒకరు ‘వెలు గు’తో చెప్పారు.
నకిరేకల్లో మల్లయ్య టార్గెట్..
నకిరేకల్లో కొండేటి మల్లయ్య పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గత రెండు పర్యాయాలు కూడా మల్లయ్య నకిరేకల్ సీటును ఆశించారు. జానారెడ్డి ప్రధాన అనుచరుడైన మల్లయ్యకు ఈసారి టికెట్ కన్ఫార్మ్గా ఇస్తామని పార్టీ హైకమాండ్ భరోసా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో పాటు సభలు, సమావేశాలు పెడుతున్నారు. అయితే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఉన్న విభేదాలు మల్లయ్యను కష్టాల్లో పడేశాయి. వెంకటరెడ్డి నో చెప్పడంతో మల్లయ్య ప్రతిపాదించిన మండల కమిటీలను హైకమాండ్ ఆమోదించ లేదు.
భట్టి విక్రమార్క యాత్రప్పుడు వెంకటరెడ్డి వర్గీయులు మల్లయ్యపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆయనకు పోటీగా కొత్త లీడర్ల ను తెరపైకి తెచ్చారు. దైదా రవీందర్, శ్రీధర్కు తోడుగా కొత్తగా ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన ప్రసన్నరాజ్ నకిరేకల్లో తిరగడం మొదలు పెట్టడంతో మల్లయ్య డైలామాలో పడ్డారు. మల్లయ్య నకిరేకల్పోటీ నుంచి తప్పుకుంటే ఎమ్మెల్సీ లేదా జడ్పీ చైర్మన్ చేస్తానని ఆయన అనుచరులతో వెంకటరెడ్డి చెప్పినట్లు తెలిసింది.
ఆలేరులో బీర్ల టెన్షన్..
ఈక్వేషన్స్అన్నీ కుదిరితే వచ్చే ఎన్నికల్లో ఆలేరు టికెట్ తనకే వస్తుందని బీర్ల అయిలయ్య ధీమాతో ఉన్నారు. కానీ, ఇటీవల భువనగిరి సీటు బీసీలకు ఇస్తామని ఎంపీ వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కొంత గందరగోళంలోకి నెట్టేశాయి. వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఆలేరు నుంచి పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. పార్టీ హైకమాండ్, ఎంపీ వెంకటరెడ్డి ఆశీస్సులు బీర్లకు పుష్కలంగానే ఉన్నాయి. కానీ, ప్రమాదం ఎటువైపు నుంచి ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు.
సూర్యాపేటలో కూడా రేవంత్ అండంతో పటేల్ రమేశ్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తుండగా, స్థానిక పార్టీ నేతలు ఎవరూ సహరించకుండా దామోదర్ రెడ్డి వర్గం అడ్డుపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హైకమాండ్ ఇచ్చిన భరోసాతోనే ఆశావహులు ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసే పనిలో ఉండగా, సీనియర్లు వాళ్లను పక్కకు తప్పించేందుకు తెరవెనక పావులు కదపడం ఆందోళన కలిగిస్తోంది.