జీలాంగ్: టీ20 వరల్డ్ కప్ సంచలన ఫలితంతో మొదలైంది. గత నెల ఆసియా కప్ గెలిచి జోరుమీదున్న శ్రీలంకకు..తొలి మ్యాచ్లోనే ఊహించిన షాక్ తగిలింది. మాజీ చాంపియన్ అయిన లంక అనామక ప్రత్యర్థి నమీబియా చేతిలో ఘోరంగా దెబ్బతిన్నది. జాన్ ఫ్రిలింక్ (28 బాల్స్లో 4 ఫోర్లతో 44, 2/26) ఆల్రౌండ్ షోతో అదరగొట్టడంతో.. ఆదివారం జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్లో నమీబియా 55 రన్స్ తేడాతో లంకపై నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన నమీబియా 20 ఓవర్లలో 163/7 స్కోరు చేసింది. ఫ్రిలింక్కు తోడుగా జేజే స్మిత్ (16 బాల్స్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 నాటౌట్) రాణించాడు. స్టార్టింగ్లో లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. నమీబియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. వాన్ లిన్జెన్ (3), డివాన్ కాక్ (9), జాన్ నికోల్ (20), స్టీఫాన్ బార్డ్ (26), కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ (20), డేవిడ్ వీస్ (0) నిరాశపర్చడంతో నమీబియా 15 ఓవర్లలో 93/6 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో ఫ్రిలింక్, స్మిత్.. డెత్ ఓవర్స్లో లంక బౌలర్లను ఉతికి ఆరేశారు. ఏడో వికెట్కు కేవలం 33 బాల్స్లోనే 69 రన్స్ జోడించి మంచి టార్గెట్ను నిర్దేశించారు. ప్రమోద్ 2 వికెట్లు తీశాడు.
లంక ఢమాల్..
టార్గెట్ ఛేజింగ్లో శ్రీలంక 19 ఓవర్లలో 108 రన్స్కు కుప్పకూలింది. దసున్ షనక (29) టాప్ స్కోరర్. నమీబియా పేసర్ బెన్ షికాంగో (2/22) లంక టాప్ ఆర్డర్ను వణికించాడు. ఈ క్రమంలో నాలుగో ఓవర్లో నిశాంక (9), గుణతిలక (0)ను ఔట్ చేసిన షికాంగో హ్యాట్రిక్ పై నిలిచాడు. వీస్ (2/16), షుల్జ్ (2/18) కూడా సూపర్గా బౌలింగ్ చేయడంతో ఏ దశలోనూ లంకేయులు టార్గెట్ను అందుకునే దిశగా కనిపించలేదు. భానుక రాజపక్స (20), షనక కాసేపు పోరాటం చేసినా.. ఈ జోడీని ఫ్రిలింక్ విడగొట్టాడు. కుశాల్ మెండిస్ (6), ధనంజయ డిసిల్వా (12), హసరంగ (4), చమిక కరుణరత్నె (5), ప్రమోద్ (0), చమీర (8) ఫెయిలవడంతో లంకకు ఓటమి తప్పలేదు. ఫ్రిలింక్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.