
మహబూబ్నగర్(నారాయణ పేట), వెలుగు: ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వెంటనే రిపేర్లు చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. మంగళవారం దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. తొలుత జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్డీవో ఆఫీస్, పాత బస్టాండ్ మీదుగా పళ్లా బ్రిడ్జి, ఎంబీ చర్చి ఆర్అండ్బీ రోడ్డును, ఎక్లాస్పూర్ మార్గంలోని లోకపల్లి లక్ష్మమ్మ గుడికి వెళ్లే మట్టి రోడ్డును పరిశీలించారు. ఇటీవల లోకపల్లి లక్ష్మమ్మ జాతరకు ముందు ఆ రోడ్డును మట్టి వేసి చదును చేయగా వారం కింద కురిసిన వర్షాలకు దెబ్బతిన్నదని పీఆర్ ఈఈ హీర్యానాయక్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
స్పందించిన కలెక్టర్ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. జాతరకు ఎంత మంది భక్తులు వస్తారని ప్రశ్నించగా దాదాపు 50 నుంచి 60 వేల మంది వస్తారని లోకపల్లి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం కలెక్టర్ ఊట్కూరు మండలం వల్లంపల్లి గ్రామానికి వెళ్లే మట్టి రహదారిని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లోని తన చాంబర్ ఆర్అండ్బీ, పీఆర్, ఇరిగేషన్ అధికారులతో విపత్తు నిర్వహణ నిధుల వినియోగంపై కలెక్టర్ చర్చించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ వెంకటరమణ, డీఈ రాములు, ఇరిగేషన్ ఈఈ బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య పాల్గొన్నారు.