సిలబస్​పై పట్టుంటే ..జేఈఈ మెయిన్స్​ ఈజీ

సిలబస్​పై పట్టుంటే ..జేఈఈ మెయిన్స్​ ఈజీ

ఎన్‌‌‌‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెక్నికల్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూట్స్‌‌‌‌లో  బీటెక్‌‌‌‌ అడ్మిషన్స్​కు నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్​ పరీక్ష నిర్వహిస్తుంది. ఐఐటీల్లో అడ్మిషన్స్‌‌‌‌ కోసం  జేఈఈ అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌ ఉంటుంది. ఈ పరీక్షల కోసం విద్యార్థులు ఇంటర్‌‌‌‌ ఎంపీసీలో చేరిన మొదటి రోజునుంచే కష్టపడుతుంటారు. 2024  జనవరి 24 నుంచి తొలి సెషన్‌‌‌‌ను, ఏప్రిల్‌‌‌‌ 1 నుంచి రెండో సెషన్‌‌‌‌ను నిర్వహిస్తామని ఎన్‌‌‌‌టీఏ ప్రకటించిన నేపథ్యంలో  జేఈఈ మెయిన్‌‌‌‌ ఎగ్జామ్​ ప్యాటర్న్​ గురించి తెలుసుకుందాం..

జేఈఈ- మెయిన్స్​ దేశంలోని ప్రతిష్టాత్మక ఇన్‌‌‌‌స్టిట్యూట్స్‌‌‌‌లో బీటెక్‌‌‌‌లో అడ్మిషన్స్​కు నిర్వహించే పరీక్ష. ఏటా లక్షల మంది పోటీ పడుతుంటారు. ఎన్‌‌‌‌టీఏ ముందుగానే పరీక్ష తేదీలు ప్రకటించడంతో విద్యార్థులు ఇప్పటి నుంచే నిర్దిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌‌‌‌ సాగిస్తే మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు.

పోటీ ఎక్కువే :  జేఈఈ -మెయిన్స్​కు జాతీయ స్థాయిలో సంవత్సరానికి పది లక్షల మందికిపైగా విద్యార్థులు పోటీ పడుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌‌‌‌ రెండు సెషన్లలో కలిపి 11,13,325 మంది పరీక్షకు హాజరయ్యా­రు. జనవరి సెషన్‌‌‌‌లో 8,23,967 మంది, ఏప్రిల్‌‌‌‌ సెషన్‌‌‌‌లో 8,83,367 మంది పరీక్ష రాసారు. తెలుగు రాష్ట్రాల నుంచి 1.10 లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతుంటారు.

ఎగ్జామ్స్​ ఎప్పుడంటే :  జేఈఈ- మెయిన్‌‌‌‌ 2024 తేదీలను ఎన్‌‌‌‌టీఏ ప్రకటించింది. తొలి సెషన్‌‌‌‌ను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు, రెండో సెషన్‌‌‌‌ను ఏప్రిల్‌‌‌‌ 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తొలి సెషన్‌‌‌‌కు సుమారు మూడు నెలలు, రెండో సెషన్‌‌‌‌  దాదాపు ఏడు నెలల సమయం ఉంది. విద్యార్థులు సరైన టైమ్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ రూపొందించుకొని జేఈఈ- మెయిన్‌‌‌‌కు సన్నద్ధమయ్యే అవకాశం ఉంది.

ఆబ్జెక్టివ్ ఎగ్జామ్​.. నెగెటివ్​ మార్కులు : బీఈ, బీటెక్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌లలో ప్రవేశానికి మొత్తం 300 మార్కులకు జేఈఈ మెయిన్‌‌‌‌(పేపర్‌‌‌‌1) పరీక్ష నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 30 ప్రశ్నల చొప్పున మొత్తం 90 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్టులో సెక్షన్‌‌‌‌ ఎ, సెక్షన్‌‌‌‌ బి ఉంటాయి. సెక్షన్‌‌‌‌- ఎ పూర్తిగా ఆబ్జెక్టివ్‌‌‌‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో (ఎంసీక్యూలతో) ఉంటుంది. సెక్షన్‌‌‌‌ -బి లో న్యూమరికల్‌‌‌‌ వాల్యూ ఆధారిత ప్రశ్నలుంటాయి. ఛాయిస్‌‌‌‌ విధానం కారణంగా సెక్షన్‌‌‌‌- బిలో 10 ప్రశ్నల్లో అయిదింటికి సమాధానం ఇస్తే సరిపోతుంది. సెక్షన్‌‌‌‌- ఎలో 0.25 శాతం నెగెటివ్‌‌‌‌ మార్కింగ్‌‌‌‌ నిబంధన ఉంది.

ఉమ్మడి అంశాలపై దృష్టి :  ప్రస్తుతం సెకండ్​ ఇయర్​ విద్యార్థులు డిసెంబర్‌‌‌‌ రెండో వారం నాటికి ఇంటర్మీడియెట్‌‌‌‌ సిలబస్‌‌‌‌ను పూర్తి చేసుకుంటారు. జేఈఈ- మెయిన్‌‌‌‌ జనవరి సెషన్‌‌‌‌ పరీక్షలో రాణించేలా ఇప్పటి నుంచి ఉమ్మడి అంశాలపై దృష్టి పెట్టాలి. ఇంటర్మీడియెట్, జేఈఈ- మెయిన్‌‌‌‌లో ఉన్న ఉమ్మడి టాపిక్స్‌‌‌‌ రివిజన్​కు అధిక సమయం కేటాయించాలి. తద్వారా జేఈఈ- మెయిన్‌‌‌‌ జనవరి సెషన్‌‌‌‌లో మంచి ప్రతిభ కనబర్చడానికి అవకాశం ఉంటుంది.

అప్లికేషన్​ ఓరియెంటెడ్ ప్రిపరేషన్ ​:  ఇంటర్ ఫైనల్​ ఇయర్​ విద్యార్థులు జేఈఈ-మెయిన్‌‌‌‌ పరీక్ష ప్రశ్నల తీరుపై అవగాహన పెంచుకోవాలి. ఆ దిశగా ఆయా సబ్జెక్ట్‌‌‌‌లను అప్లికేషన్‌‌‌‌ ఓరియెంటేషన్‌‌‌‌తో అధ్యయనం చేయాలి. ముఖ్యంగా ఆయా సబ్జెక్ట్‌‌‌‌ల బేసిక్‌‌‌‌ కాన్సెప్ట్స్‌‌‌‌పై పట్టు సాధించాలి. వాటిని వాస్తవ పరిస్థితులతో అన్వయం చేసుకుంటూ చదవాలి. ఫలితంగా ఇంటర్‌‌‌‌ సబ్జెక్ట్‌‌‌‌లపై పూర్తి స్థాయి పట్టుతోపాటు జేఈఈ- మెయిన్‌‌‌‌లోనూ రాణించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా చదివేటప్పుడే ముఖ్యమైన ఫార్ములాలు, కీ పాయింట్స్‌‌‌‌ను షార్ట్‌‌‌‌ నోట్స్‌‌‌‌గా రూపొందించుకుంటే ఎగ్జామ్​ టైమ్​లో రివిజన్‌‌‌‌కు ఈజీగా ఉంటుంది.

సిలబస్‌‌‌‌ అనుసంధానం :  జేఈఈ -మెయిన్‌‌‌‌ విద్యార్థులు మొదటి, ద్వితీయ సంవత్సరం సిలబస్‌‌‌‌ను అనుసంధానం చేసుకుంటూ చదవాలి. మొదటి సంవత్సరం అంశాలను, రెండో సంవత్సరం అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్​ సాగిస్తే.. సంబంధిత అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన లభించడంతోపాటు ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇవ్వొచ్చు.  జేఈఈ- మెయిన్‌‌‌‌ సిలబస్‌‌‌‌లో ఇంటర్మీడియెట్‌‌‌‌ మొదటి, ద్వితీయ సంవత్సరం సిలబస్‌‌‌‌ అంశాలకు సమ ప్రాధాన్యం ఉంటోంది.  రెండు సంవత్సరాల సిలబస్‌‌‌‌పై పట్టు సాధించేలా కృషి చేయాలి.

న్యూమరికల్‌‌‌‌ ప్రశ్నలపై ఫోకస్ : అభ్యర్థులు ముఖ్యంగా న్యూమరికల్‌‌‌‌ టైప్‌‌‌‌ కొశ్చన్స్‌‌‌‌ ప్రిపరేషన్‌‌‌‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. జేఈఈ- మెయిన్‌‌‌‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్​ ఈ మూడు సబ్జెక్ట్‌‌‌‌ల నుంచీ అయిదు ప్రశ్నలు చొప్పున న్యూమరికల్‌‌‌‌ ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంటర్‌‌‌‌ విద్యార్థులు అప్లికేషన్‌‌‌‌ ఆధారిత ప్రిపరేషన్‌‌‌‌కు, ఆయా సబ్జెక్ట్‌‌‌‌లలో న్యూమరిక్స్‌‌‌‌ ఆధారంగా సమాధానం సాధించాల్సిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

ప్రాక్టీస్‌‌‌‌ ముఖ్యం :  ఇంటర్, జేఈఈ- మెయిన్‌‌‌‌ రెండు పరీక్షలకూ ప్రాక్టీస్‌‌‌‌ ముఖ్యం. విద్యార్థులు మెయిన్‌‌‌‌ మాక్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లకు, ఇంటర్‌‌‌‌ ప్రీ-ఫైనల్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లకు హాజరైతే  పరీక్షలో రాణించేందుకు అవకాశం ఉంటుంది. జనవరి సెషన్‌‌‌‌కు హాజరయ్యే అభ్యర్థులకు ప్రస్తుతం దాదాపు నెలరోజుల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయంలో వీరు అధిక సమయాన్ని రివిజన్​కు, వీక్లీ టెస్ట్‌‌‌‌లకు, మాక్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లకు కేటాయించాలి.

ఏప్రిల్‌‌‌‌ సెషన్‌‌‌‌ ప్లాన్ ​: ఏప్రిల్‌‌‌‌ సెషన్‌‌‌‌పై ఫోకస్​ చేసిన విద్యార్థులు ఇప్ప­టి నుంచే మంచి వ్యూహంతో ప్రిపరేషన్‌‌‌‌ సాగిస్తే మంచి మార్కులు పొందవచ్చు. డిసెంబర్‌‌‌‌లో ఇంటర్‌‌‌‌ సిలబస్‌‌‌‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు జేఈఈ- మెయిన్‌‌‌‌ పరీక్ష సిలబస్‌‌‌‌కు అనుగుణంగా ఫిబ్రవరి చివరి వారం వరకు ప్రిపరేషన్‌‌‌‌ సాగించాలి. ఇంటర్‌‌‌‌ పరీక్షలు పూర్తయిన తర్వాత ఏప్రిల్‌‌‌‌ సెషన్‌‌‌‌ తేదీకి మధ్య సమయాన్ని పూర్తిగా రివిజన్, మాక్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ల ప్రాక్టీస్‌‌‌‌కు కేటాయించాలి.

టైమ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ :  పోటీ పరీక్షల్లో టైమ్​ మేనేజ్​మెంట్​ చాలా ముఖ్యం. రోజూ ప్రతి సబ్జెక్ట్‌‌‌‌ చదివే విధంగా సమయం కేటాయించాలి. కనీసం రెండు గంట­లు ఒక్కో సబ్జెక్టుకు సమయం కేటాయించాలి. సులభమైన సబ్జెక్ట్‌‌‌‌కు తక్కువ సమయం కేటాయించి, క్లిష్టంగా భావించే సబ్జెక్ట్‌‌‌‌లకు ఎక్కువ సమయం కేటాయించాలి. ముందు రోజు చదివిన అంశాన్ని ఒకసారి రివిజన్​ చేసుకోవడం బెటర్.

సబ్జెక్ట్‌‌‌‌ వారీగా టాపిక్స్‌‌‌‌

మ్యాథ్స్ ​:  సిలబస్‌‌‌‌కు సంబంధించి ప్రతి చాప్టర్‌‌‌‌ను తప్పనిసరిగా చదవాలి. 3-డీ జామెట్రీ; కో ఆర్డినేట్‌‌‌‌ జామెట్రీ; వెక్టార్‌‌‌‌ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్‌‌‌‌; కాంప్లెక్స్‌‌‌‌ నెంబర్స్‌‌‌‌; పారాబోలా; ట్రిగ్నోమెట్రిక్‌‌‌‌ రేషియోస్‌‌‌‌. వీటితోపాటు క్వాడ్రాటిక్‌‌‌‌ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్‌‌‌‌ ఈక్వేషన్స్‌‌‌‌; పెర్ముటేషన్‌‌‌‌ అండ్‌‌‌‌ కాంబినేషన్,  బైనామియల్‌‌‌‌ థీరమ్, లోకస్‌‌‌‌ అంశాలను ఒక్కసారైనా పూర్తి చేసే విధంగా ప్రిపరేషన్‌‌‌‌ ఉండాలి.

ఫిజిక్స్‌‌‌‌ : ఈ విభాగంలో న్యూమరికల్‌‌‌‌ అప్లికేషన్‌‌‌‌ అప్రోచ్‌‌‌‌కు ప్రాధాన్యమివ్వాలి. ఎలక్ట్రో డైనమిక్స్, హీట్‌‌‌‌ అండ్‌‌‌‌ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్‌‌‌‌ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌‌‌‌హెఎం అండ్‌‌‌‌ వేవ్స్‌‌‌‌కు ప్రాధాన్యమివ్వాలి. సెంటర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ మాస్, మొమెంటమ్‌‌‌‌ అండ్‌‌‌‌ కొలిజన్‌‌‌‌; సింపుల్‌‌‌‌ హార్మోనిక్‌‌‌‌ మోషన్,వేవ్‌‌‌‌ మోష­న్‌‌‌‌ అండ్‌‌‌‌ స్ట్రింగ్‌‌‌‌ వేవ్స్‌‌‌‌పై అవగాహన ఏర్పరచుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు.

కెమిస్ట్రీ :  ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు కెమికల్‌‌‌‌ బాండింగ్, పిరియాడిక్‌‌‌‌ టేబుల్, బ్రేకింగ్‌‌‌‌ల మూలాలపై నైపుణ్యాలను తెలుసుకునే విధంగా ఉంటాయి. మోల్‌‌‌‌ కాన్సెప్ట్, కోఆర్డినేషన్‌‌‌‌ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి-బ్లాక్‌‌‌‌ ఎలిమెంట్స్, అటామిక్‌‌‌‌ స్ట్రక్చర్, గ్యాసియస్‌‌‌‌ స్టేట్, ఆల్డిహైడ్స్‌‌‌‌ అండ్‌‌‌‌ కీటోన్స్, జనరల్‌‌‌‌ ఆర్గానిక్‌‌‌‌ కెమిస్ట్రీ, డి అండ్‌‌‌‌ ఎఫ్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ ఎలిమెంట్స్‌‌‌‌పై పట్టు సాధించాలి. 

అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌ అర్హత : ఐఐటీల్లో అడ్మిషన్స్​కు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌కు జేఈఈ-మెయిన్‌‌‌‌ నుంచి 2.5 లక్షల మందిని ఎంపిక చేస్తారు. జేఈఈ -మెయిన్స్​లో​ మంచి స్కోర్‌‌‌‌ సాధించేలా కృషి చేస్తే.. అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌కు అవకాశం లభిస్తుంది.