భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో శనివారం ఇన్ఫార్మర్ నెపంతో ఓ మాజీ మావోయిస్టును నక్సల్స్ హత్య చేశారు. పామేడు పోలీస్స్టేషన్ పరిధిలోని ఎర్రపల్లి గ్రామంలో ఉంటున్న మాజీ మావోయిస్టు బుద్రా ఇంటి వద్దకు సాయుధ నక్సల్స్ వచ్చారు. నిద్రిస్తున్న బుద్రాను బలవంతంగా బయటకు తీసుకొచ్చారు.
ఊరి శివారుకు తీసుకెళ్లి ప్రజాకోర్టు పెట్టి అతన్ని చితకబాదారు. దళాల సమాచారం పోలీసులకు చెబుతున్నావంటూ అభియోగం మోపారు. కత్తులతో పొడిచి చంపారు. శవాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. గ్రామస్తులు పామేడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భద్రతా బలగాలు డెడ్బాడీని పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు పంపించారు.
