న్యూఢిల్లీ: జీమెయిల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ వంటి కంపెనీల కస్టమర్ల 14.9 కోట్ల అకౌంట్ల వివరాలు లీక్ అయ్యాయని తాజా స్టడీ తెలిపింది. వీటి యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ బహిరంగంగా అందుబాటులోకి వచ్చాయని ఎక్స్ప్రెస్ వీపీఎన్ స్టడీ రిపోర్ట్ వెల్లడించింది. ఈ డేటాబేస్లో 4.8 కోట్ల జీమెయిల్ ఖాతాలు, 40 లక్షల యాహూ ఖాతాలు, 1.7 లక్షల ఫేస్బుక్ ఖాతాలు ఉన్నాయి. అంతేగాక 65 లక్షల ఇన్స్టాగ్రామ్, 34 లక్షల నెట్ఫ్లిక్స్, 15 లక్షల ఔట్ లుక్ ఖాతాల సమాచారం కూడా బయటకు వచ్చిందని ఈ రిపోర్టును తయారు చేసిన సైబర్సెక్యూరిటీ రీసెర్చర్ జెరెమియా ఫాలర్ చెప్పారు. ‘‘ఈ డేటాబేస్కు పాస్వర్డ్ రక్షణ లేదు. ఇందులో మొత్తం 14,94,04,754 లాగిన్స్ వివరాలు ఉన్నాయి. డేటాబేస్ సైజు సుమారు 96 జీబీ ఉంటుంది. ఇది నెట్లో అందరికీ అందుబాటులో ఉంది” అని ఆయన హెచ్చరించారు. సాధారణంగా ముఖ్యమైన సమాచారాన్ని రహస్య కోడ్ భాషలోకి (ఎన్క్రిప్షన్) మారుస్తారు. ఇక్కడ ఆ సమాచారాన్ని ఎన్క్రిప్ట్ చేయకుండా సాధారణ టెక్స్ట్ రూపంలోనే భద్రపరిచారు. దీనివల్ల నేరగాళ్లు లేదా ఇంటర్నెట్ వాడే ఎవరైనా ఆ సమాచారాన్ని సులభంగా చూసే అవకాశం కలిగింది. బాధితుల నుంచి సేకరించిన ఈ–మెయిల్స్, యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ అన్నింటినీ ఒకే చోట చేర్చి స్టోర్ చేశారు. ఈ సమాచారాన్ని నేరగాళ్లు 'క్రెడెన్షియల్ స్టఫింగ్' దాడుల కోసం వాడుకునే ప్రమాదం ఉందని ఫౌలర్ ఈ రిపోర్టులో హెచ్చరించారు.
బ్యాంకు ఖాతాలకూ ముప్పు
బాధితులకు చెందిన అన్ని రకాల ఆన్లైన్ ఖాతాల వివరాలు ఇందులో ఉన్నాయని ఫౌలర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం సోషల్మీడియా ఖాతాలే కాకుండా ఆర్థిక సేవల ఖాతాలు, క్రిప్టో వాలెట్లు, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ లాగిన్, పాస్వర్డ్స్ కూడా ఈ జాబితాలో కనిపించాయి. వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వ డొమైన్ల ఖాతాలు ఇందులో ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ అనుబంధ ఖాతాల ద్వారా సున్నితమైన వ్యవస్థల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. అధికారుల హోదా, వారికి ఉన్న అనుమతులను బట్టి నేరగాళ్లు ప్రభుత్వ నెట్వర్క్లను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇది జాతీయ భద్రత, ప్రజా రక్షణకు పెద్ద ముప్పుగా మారుతుందని ఫౌలర్ హెచ్చరించారు. ‘‘పెద్ద సంఖ్యలో ప్రజల సమాచారం దొంగతనానికి గురికావడం వల్ల వారికి తెలియకుండానే భద్రతాపరమైన ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమాచారంలో ఈ–మెయిల్స్, సీక్రెట్ కోడ్స్ ఉన్నందున నేరగాళ్లు వీటిని ఆటోమేటెడ్ దాడులకు వాడే వీలుంది. దీనివల్ల ఆర్థిక నేరాలు, గుర్తింపు దొంగతనం పెరిగే ప్రమాదం పొంచి ఉంది. అసలైన ఖాతా వివరాలను వాడుతూ నేరగాళ్లు పంపే సందేశాలను సామాన్యులు నిజమని నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది”అని రిపోర్ట్ పేర్కొంది. ఎక్స్ప్రెస్ వీపీఎన్ స్టడీపై సంబంధిత కంపెనీలు ఇంకా స్పందించలేదని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
