ముంబై:దేశంలో గోల్డ్ బ్యాంకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ గాంధి సూచించారు. ప్రజల వద్ద ఉన్న బంగారాన్ని మానిటైజ్ చేసేందుకు ఇది ఆవశ్యకమని చెప్పారు. మన దేశంలోని ప్రజలకు బంగారాన్ని ఫిజికల్గా (బంగారంగానో లేదా నగలుగానో) అట్టేపెట్టుకోవడం ఇష్టమని, దానిని దృష్టిలో పెట్టుకునే మనం వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. ఎకానమీ డెవలప్మెంట్ కోసం గోల్డ్ను మానిటైజ్ చేసుకోవడం మేలని అన్నారు. దేశంలోని హౌస్హోల్డ్స్, మత సంస్థల వద్ద 23 వేల నుంచి 24 వేల టన్నుల బంగారం ఉందని, కాకపోతే ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చడం అంత ఈజీ కాదని గాంధి అభిప్రాయపడ్డారు. గోల్డ్ బ్యాంకు ఏర్పాటు ప్రపోజల్ను మరోసారి సీరియస్గా ఆలోచించాల్సిన టైము వచ్చిందని పేర్కొన్నారు. గోల్డ్ డిపాజిట్లను తీసుకుని, గోల్డ్ లోన్లు మాత్రమే ఇచ్చేలా ఈ బ్యాంకు ఉండాలన్నారు. డిజిటల్ లెండింగ్ కంపెనీ రూపీక్ నిర్వహించిన వర్చువల్ ఈవెంట్లో గాంధి మాట్లాడారు.
ఫైనాన్షియల్ గోల్డ్కు చాలా ఆప్షన్లు వచ్చాయ్..
ప్రజలకు ఇప్పుడు గోల్డ్ డిపాజిట్లు, గోల్డ్ మెటల్ లోన్లు, గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్ వంటి ఫైనాన్షియల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయని గాంధి పేర్కొన్నారు. గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్ స్కీములు ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే ప్రజల చేతిలో ఉన్న బంగారం వినియోగంలోకి తేవాలంటే గోల్డ్ డిపాజిట్ల ద్వారా సాధ్యపడుతుందని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ పేర్కొన్నారు. ప్రస్తుత బంగారం ధరలకు కొత్తగా తెచ్చే ప్రొడక్టులను లింక్ చేయాలని, అవగాహన పెంచేందుకు మార్కెటింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని చెప్పారు. ఫలితంగా పబ్లిక్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్లు, క్యాపిటల్గా మారుతాయని అన్నారు. ఫిజికల్ గోల్డ్ నుంచి ప్రజలను మళ్లించడానికి చాలా ఛాలెంజెస్ ఉంటాయని చెబుతూ, వారి ఆలోచనలను అంత ఈజీగా మార్చలేమని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఆభరణాల రూపంలోనే బంగారాన్ని ఎందుకు ఇష్టపడుతున్నారో తెలుసుకోవల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇనొవేటివ్ థింకింగ్ కావాలని అంటూ గోల్డ్ డిపాజిట్ స్కీము ఎలా ఉండాలో తన అభిప్రాయాన్ని చెప్పారు గాంధి. ఎవరైనా ఒక టైపు జ్యుయెలరీ తెచ్చి డిపాజిట్ చేస్తే, పదేళ్ల తర్వాత అదే టైపు జ్యుయెలరీ డిపాజిటర్కు తిరిగి ఇచ్చేలా స్కీములు ఉండాలని అన్నారు. దీని వల్ల చాలా బంగారాన్ని మానిటైజ్ చేసుకునే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఫైనాన్షియల్ గోల్డ్ వైపు మళ్లేలా లాంగ్ టర్మ్ మిషన్ అమలు కావాలని చెప్పారు. ప్రతి ఇంటిలోనూ గోల్డ్గా పొదుపు చేసే ప్రతీ రూపాయీ ఎకానమీ గ్రోత్కు పెట్టుబడిగా, క్యాపిటల్గా మారాలని చెప్పారు. గోల్డ్ మానిటైజేషన్ వల్లే ఇది సాధ్యమవుతుందన్నారు.
హైగ్రోత్కు బంగారం మానిటైజేషన్.....
క్రమం తప్పకుండా ఎక్కువ గ్రోత్ రేటు సాధించాలనుకునే ఇండియా లాంటి ఎమర్జింగ్ ఎకానమీలకు చాలా క్యాపిటల్ అవసరమని గాంధి చెప్పారు. ఫలితంగా దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. గోల్డ్ బ్యాంకు ఏర్పాటుకు కొన్ని రూల్స్ అవసరమని, చట్టపరమైన ఫెసిలిటేషన్ కూడా కావాలని చెప్పారు. గోల్డ్ బ్యాంకు లైసెన్సింగ్ పాలసీ తేవాలని, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో వంటి నిబంధనలూ తేవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఫిజికల్ గోల్డ్ను మానిటైజ్ చేయడానికి గోల్డ్ బ్యాంకు క్యాటలిస్ట్గా, మార్కెట్ మేకర్గా ఉంటుందని చెప్పారు. గత కొన్నేళ్లుగా దేశంలో బంగారంపై పాలసీలు మారుతూ వస్తున్నాయని, ఫైనాన్షియల్ గోల్డ్లో పెట్టుబడులు పెట్టేలా ప్రజలను ఎంకరేజ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల చేతిలోని గోల్డ్ హోల్డింగ్స్ మానిటైజేషన్కు చొరవ తీసుకోవాలని, బంగారం క్వాలిటీ కంట్రోల్కు లైసెన్స్డ్ రిఫైనరీలు, హాల్మార్కింగ్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని కూడా గాంధి సూచించారు.