
- గత ఐదేళ్లలో 25 కంపెనీలు పెద్దగా లాభాలివ్వలే..
బెంగళూరు: గత ఐదేళ్లలో మార్కెట్లో లిస్టింగ్ అయిన కొత్త తరం టెక్ కంపెనీలు ఇన్వెస్టర్లకు చేదు అనుభవాలనే మిగిల్చాయి. వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ క్లయింట్ అసోసియేట్స్ రిపోర్ట్ ప్రకారం, వెంచర్ క్యాపిటలిస్ట్లకు వాటాలున్న 25 కొత్త తరం టెక్ కంపెనీలు బీఎస్ఈ500 ఇండెక్స్ ఇచ్చిన రిటర్న్ (90 శాతం) కంటే తక్కువ పెరిగాయి. ఈ కంపెనీల ఐపీఓలు సగటున 48.5 రెట్లు ఓవర్సబ్స్క్రిప్షన్ పొందాయి. 68శాతం మొదటి రోజే సగటున 24.1శాతం లాభాలను ఇచ్చాయి. కానీ, చాలా కంపెనీలు ఈ లాభాలను నిలుపుకోలేకపోయాయి.
జొమాటో, నజారా టెక్నాలజీస్, ఇగ్జిగో వంటి కంపెనీలు స్థిరంగా మంచి పనితీరు కనబరిచాయి. అయితే, కొన్ని కంపెనీల షేర్లు లిస్టింగ్ తర్వాత భారీగా పడ్డాయి. ఐపీఓకు ముందు పెట్టుబడి పెట్టి, ఆరు నెలల లాక్-ఇన్ గడువు ముగిసిన తర్వాత ఎగ్జిట్ అయిన ఇన్వెస్టర్లు మంచి రిస్క్- అడ్జస్టెడ్ రిటర్న్స్ పొందారు. ఆ సమయంలో 52శాతం కంపెనీలు భారీ రిటర్న్ ఇచ్చాయి.
అదే సమయంలో ఎగ్జిట్ కాకుండా పెట్టుబడిని కొనసాగించినవారికి 38 శాతం కంపెనీలే భారీ రిటర్న్ ఇచ్చాయి. అన్లిస్టెడ్ మార్కెట్లో ఎక్కువ రిటైల్ డిమాండ్ ఉన్న 10 ఐపీఓలు మిగతా వాటికంటే బాగా వెనకబడ్డాయి. ఆఫర్ ఫర్ సేల్, ప్రైమరీ ఇష్యూ ప్రభావం ఐపీఓ పనితీరుపై లేదు.