
- కొత్త స్థానికతకు తగ్గట్టుగా చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు
- పోస్టింగ్ పొందిన మూడు రోజుల్లో డ్యూటీలో చేరాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: కొత్త స్థానికతకు తగ్గట్టుగా ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు, పోస్టింగుల కోసం రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలకు అలకేట్ అయిన డిస్ట్రిక్ట్ కేడర్ ఉద్యోగుల నుంచి పోస్టింగులకు ఆప్షన్లు తీసుకోనుంది. ఈ ప్రక్రియను కలెక్టర్, జిల్లా హెచ్ఓడీలతో కూడిన కమిటీ కౌన్సెలింగ్ పద్ధతిలో వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. పోస్టింగ్ పొందిన తర్వాత మూడు రోజుల్లోపు డ్యూటీలో చేరాలని, దీనికి తగ్గట్టు హెచ్ఓడీలు కూడా ఆర్డర్ ఇచ్చి మూడు రోజుల్లోపే రిలీవ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బదిలీ ప్రక్రియ, పోస్టింగ్ ఆర్డర్ జారీ సజావుగా, సక్రమంగా జరిగేలా చొరవ తీసుకోవాలని డిపార్ట్మెంట్ల కార్యదర్శులను, హెచ్వోడీలను ఆదేశించారు. దీనిపై రోజూ సెక్రటేరియేట్లో అప్డేట్ అందించాలన్నారు. జిల్లా కేడర్తో పాటు జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగులకు కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుందని సర్క్యులర్లో పేర్కొన్నారు. జోనల్, మల్టీ జోనల్ పోస్టింగ్ ల విషయంలో అవసరమైతే ప్రత్యేకంగా ఆపరేషనల్ గైడ్ లైన్స్ జారీ చేస్తామని వివరించారు.
- ఉద్యోగుల విభజనలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాకే ఆ ఉద్యోగి అలకేట్అయినట్లయితే ఆ ఉద్యోగికి ఎలాంటి ట్రాన్స్ ఫర్ ఉండదు. ఏ పోస్టులో అయితే పనిచేస్తున్నారో అదే పోస్టులో పనిచేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణ: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల జిల్లా ఉద్యోగి.. విభజనలో భాగంగా మంచిర్యాల జిల్లాకే అలకేట్ అయ్యాడు. అప్పుడు ఆ ఉద్యోగి అదే పోస్టులో ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. కొత్త పోస్టింగ్ అవసరం లేదు. ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి వేరుపడిన ఇంకో జిల్లాకు అలకేట్అయితే ఆ ఉద్యోగి అక్కడ రిపోర్ట్ చేసి, పోస్టింగు కోసం ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
- ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయించేందుకు సీనియారిటీ లిస్ట్ ప్రామాణికంగా తీసుకున్నట్లుగానే... ట్రాన్స్ఫర్లు, పోస్టింగుల కోసం కూడా సీనియారిటీ లిస్ట్ను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆయా డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు సీనియారిటీ జాబితాను సిద్ధం చేస్తారు.
- పోస్టింగ్ కోసం ఉద్యోగులు ప్రభుత్వం సూచించిన అప్లికేషన్లో ప్రయార్టీ వైజ్ ఆప్షన్స్ఇవ్వాల్సి ఉంటుంది.
- బదిలీలు, పోస్టింగులు ఇచ్చే టైంలో ఉద్యోగ సంఘాలు టీజీవో, టీఎన్జీవో మెంబర్లను మీటింగుల్లో పాల్గొనేందుకు పిలవాల్సి ఉంటుంది.
- పోలీసు, ఎక్సైజ్, స్టాంప్స్, కమర్షియల్ టాక్స్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లు పోస్టింగుల విషయంలో విడిగా గైడ్లైన్స్ జారీ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
- ఒక మండలంలో ఒకలా, ఇంకో చోట మరొకలా కాకుండా అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో సర్వీసులు సరిగ్గా అంది, పరిపాలన అవసరాలు తీర్చేలా పోస్టింగులు ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. రిమోట్ ఏరియాల్లోనూ సిబ్బంది పనిచేసేలా ఉద్యోగుల సర్దుబాటు ఉండాలని పేర్కొంది.
- కొత్త జోనల్ విధానంలో ఆయా జిల్లాలకు అలకేట్ అయిన ఉద్యోగులు అప్పీళ్ల కోసం అప్లికేషన్ పెట్టుకోవాలని రెండు రోజుల కిందట ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇప్పుడు కొత్తగా కేటాయించిన పోస్టులో చేరిన తర్వాతే అప్పీళ్లను స్వీకరించనుంది.