కొత్త ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి

కొత్త ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలి : రాష్ట్ర ఎన్నికల  ప్రధాన అధికారి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు విస్తృత ప్రచారం చేయాలని స్టేట్​చీఫ్​ఎలక్షన్​ఆఫీసర్ వికాస్ రాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో  ‘ఓటరు జాబితా ప్రత్యేక సవరణ– 2023’, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ  టీచర్స్​ఎమ్మెల్సీ ఓటరు జాబితాపై  కలెక్టర్ ఎస్. వెంకట్ రావుతో పాటు ఉమ్మడి జిల్లా ఆర్వోలు, ఏఈఆర్వోలతో రివ్యూ మీటింగ్​నిర్వహించారు.  ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ ఓటరు తొలగింపు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఓటరు కుటుంబ సభ్యుల్లో ఒకరి నుంచి ఫామ్– -7 పై సంతకం తీసుకున్న తర్వాతనే తొలగించాలన్నారు. వలస వెళ్లిన వారి పేరునుఏదైనా సర్టిఫికెట్​ఆధారంగానే తొలగించాలన్నారు. కొత్త ఓటరు ఎన్​రోల్​కోసం ఆయా కాలేజీల్లో  ఒక పాయింట్ పర్సన్ ను నియమించి  18 ఏండ్లు నిండిన వారిని గుర్తించి ఓటుహక్కు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాల్లో మెప్మా గ్రూపులు, వార్డు ఆఫీసర్లను కోఆర్డినేషన్​చేస్తూ కొత్త ఓటర్ల నమోదుకు చర్యలు తీసుకోవాలన్నారు.  ఓటరు నమోదుపై పోలీస్ శాఖ ద్వారా అన్ని జంక్షన్లలో అవగాహన  కల్పించడంతో పాటు హోర్డింగ్స్​, ఫ్లెక్సీల ఏర్పాటు,  స్థానిక కేబుల్ ఛానల్స్​ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు.   

ఓటర్ జాబితా పై వచ్చిన అభ్యంతరాలపై సీఈవో సమీక్షిస్తూ.. అభ్యంతరాలను 24 గంటలకు మించి పెండింగ్ లో  పెట్టొద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈఆర్వోలు ఓటరు జాబితా పై రోజూ అరగంట  సమయం కేటాయించాలని సూచించారు.  మహబూబ్ నగర్, -రంగారెడ్డి, -హైదరాబాద్ టీచర్​ ఎమ్మెల్సీ ఓటరు జాబితాపై సమీక్షిస్తూ ఓటరు నమోదు కోసం వచ్చిన ఫామ్స్​ను ఎలా పరిశీలిస్తున్నారని ప్రశ్నించారు. పరిశీలనలో డెసిగ్నేటెడ్ ఆఫీసర్లదే పూర్తి బాధ్యత అన్నారు. అంతకుముందు ఆయన  మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ ఆఫీస్​ను విజిట్​చేసి  ‘ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ– 2023’ , ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ అప్లికేషన్ల  విధానాన్ని పరిశీలించారు. పెండింగ్ అప్లికేషన్లు, పరిష్కరించిన వాటి వివరాలతో పాటు వివిధ అంశాలను కలెక్టర్ తో పాటు తహసీల్దార్​ను అడిగారు. 

అనంతరం వికాస్​రాజ్​వెంకటాపూర్ గ్రామాన్ని విజిట్​చేసి అక్కడ పోలింగ్ బూత్ లో ఓటరు నమోదు గురించి బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు.   అనంతరం కలెక్టరేట్​లో కలెక్టర్​వెంకట్​రావు ఓటరు జాబితా తయారీపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ద్వారా సీఈవోకు వివరించారు. అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, కె.సీతారామారావు, వనపర్తి అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, ఉమ్మడి జిల్లా ఆర్డీవోలు, ఈఆర్వోలు పాల్గొన్నారు.  అనంతరం సీఈవో తిరుగు ప్రయాణంలో కావేరమ్మపేటలోని పోలింగ్​కేంద్రాలను తనిఖీ చేసి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు.