మాయమాటలతో గెలిచేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నాలు

మాయమాటలతో గెలిచేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నాలు

నిర్మల్, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్, నిర్మల్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలోని దిలావర్పూర్, సారంగాపూర్, నర్సాపూర్, మామడ మండలాలకు చెందిన పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్, నేతలు గురువారం కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని, ఆ పార్టీలకు రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదన్నారు. బీజేపీతోనే సుస్థిరమైన పాలన సాధ్యమవుతుందన్నారు. కేంద్ర పథకాలను పక్కదోవ పట్టించి రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ కు, బీఆర్ఎస్ నేతలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీ పార్లమెంట్ ఇన్​చార్జ్ అయ్యన్న గారి భూమయ్య, పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జ్ రావుల రామనాథ్, చేరికల కమిటీ కన్వీనర్ నూతల భూపతిరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ విలాస్, టౌన్ ప్రెసిడెంట్ సాధం అరవింద్, జడ్పీటీసీ తక్కల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.