
- ఆమ్చూర్ కు ప్రసిద్ద మార్కెట్గా ఇందూర్ గంజ్
- నలుగురు ట్రేడర్ల అధీనంలో మొత్తం బిజినెస్
- నార్త్ ఇండియాకు తరలించి దండిగా లాభాలు
నిజామాబాద్, వెలుగు: ఆమ్చూర్ అమ్మకాలకు ప్రత్యేక గుర్తింపు పొందిన నిజామాబాద్ మార్కెట్లో నలుగురు ట్రేడర్ల గుత్తాధిపత్యం రైతుల పాలిట శాపంగా మారింది. ట్రేడర్లు డిసైడ్ చేసిందే రేట్గా మారడంతో మామిడి రైతులు నష్టపోతున్నారు. అసలే ప్రకృతి సహకరించక గాలిదుమారాలకు మామిడితోటలు దెబ్బతినగా ఆమ్చూర్ ( ధర తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నారు. దిగుబడి తగ్గిన టైంలో పెరగాల్సిన ధరను తగ్గించి వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు.
ఏడు జిల్లాల నుంచి
ప్రతి ఏడాది గరిష్టంగా ఇందూర్ మార్కెట్ యార్డులో రూ.32 కోట్ల వరకు ఆమ్చూర్ బిజినెస్ జరుగుతుంది. స్టేట్మొత్తంలో ఆమ్చూర్ కొనుగోలుకు చెందిన ట్రేడింగ్ లైసెన్స్లు ఇందూర్ గంజ్కు చెందిన నలుగురు ట్రేడర్లకే ఉన్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల నుంచి సరకు ఇక్కడికి వస్తుంది. గతంలో ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఆమ్చూర్ వచ్చేది. ఏటా ఏవరేజ్గా 12 వేల క్వింటాళ్ల ఆమ్చూర్ కొనుగోళ్లు ఇందూర్ గంజ్లో జరుగుతాయి.
గత నెల మూడో వారం నుంచి కాంటాలు పెడుతుండగా ఇప్పటివరకు 5,200 క్వింటాళ్ల ఆమ్చూర్ను మామిడి రైతులు విక్రయించారు. నిరుడు నాణ్యమైన మల్లిక రకం ఆమ్చూర్ క్వింటాల్కు రూ.37,200 రేటు ఉండగా ఈసారి రూ.25 వేల వరకే కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోయారు. దీంతో మార్కెట్ సిబ్బంది జోక్యం చేసుకోవడంతో క్రమంగా రేటు పెంచి బుధవారం రూ.33 వేలు చెల్లించారు. సెకెండ్ క్వాలిటీ ఆమ్చూర్ రేట్ మరీ తక్కువగా రూ.20,800 కొనసాగుతోంది.
చింతపండుకు ప్రత్యామ్నాయంగా ఆమ్చూర్
గుజరాత్, యూపీ, ఎంపీ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో చింతపండు స్థానంలో ఆమ్చూర్ఎక్కువ వాడుతుంటారు. చాట్మసాలా, సమోసా, పకోడి, సూప్, ఫ్రూట్ సలాడ్స్, కర్రీస్, చట్నీస్, పికిల్స్తో పాటు మటన్ మారినేషన్కు దీన్ని ఉపయోగిస్తారు. ఏ, ఈ విటమిన్స్అధికంగా ఉండే ఆమ్చూర్కు నార్త్ ఇండియాలో మస్తు డిమాండ్ఉంది. నిజామాబాద్ మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేసిన ఆమ్చూర్ను క్వింటాల్కు రూ.50 వేలకు మించిన రేట్తో అమ్మి భారీ లాభాలు ఆర్జిస్తుండగా సేల్ చేసిన రైతులు గతేడాది రేట్కోరుతున్నారు. నమూనా ధర కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
రేట్ పెరిగే చాన్స్ఉంది శంకర్దాస్, మార్కెట్కమిటీ 2 -గ్రేడ్ సెక్రెటరీ
గంజ్లో జూన్ 10 వరకు ఆమ్చూర్ బిజినెస్ జరుగుతుంది. రోజు ఏవరేజ్గా 500 క్వింటాళ్ల సరకు రైతులు తెస్తున్నారు. పసుపు మాదిరే ఆమ్చూర్కు లాట్ నంబర్లు ఇచ్చి ఈ–-నామ్ద్వారా రేట్ఫిక్స్ చేస్తున్నం. మొదట్లో నాణ్యమైన ఆమ్ చూర్కు చెల్లించిన రేట్ రూ. 25 వేల నుంచి ఇప్పుడు రూ. 33 వేలకు పెరిగింది. మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయి. నమూనా ధర కొంత పెరిగినప్పటికీ మరింత పెరిగితేనే రైతులకు లాభం. తమ పర్యవేక్షణలో ఎక్కడా లోపం లేదు.
►ALSO READ | మే 23 తర్వాత పెండింగ్ రైతు భరోసా .. ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం