నందిపేటకు చెందిన మాడబోయి సుజాతకు లక్కంపల్లి శివారులో సర్వే నంబర్ 432/18 లో 3.29 ఎకరాల భూమి ఉంది. 40 ఏళ్లుగా దానిని సాగు చేసుకుంటున్నారు. కొత్త పాసుబుక్తో పాటు రైతుబంధు కూడా వచ్చింది. కానీ రెండేళ్ల కింద తహసీల్దార్ డిజిటల్ సైన్ చేయకపోవడంతో ఆ సర్వే నంబర్ మిస్ అయ్యింది. దీంతో బాధితురాలు జిల్లా కేంద్రానికి వచ్చి ప్రజావాణిలో కలెక్టర్కు పిర్యాదు చేసింది. రెండేళ్లుగా ఆ దరఖాస్తును పెండింగ్లోనే ఉంది. గత 15 రోజు కింద కూడా మరోసారి పిర్యాదు చేయగా రెండు రోజుల్లో తహసీల్దార్తో సర్వే చేయించి సమస్య పరిష్కరిస్తామన్న ఆఫీసర్లు.. ఇప్పటి వరకు పత్తాలేరు.. ఒక్క సుజాతే కాదు.. ప్రజావాణికి వచ్చే చాలా మంది దరఖాస్తుదారుల పరిస్థితి ఇదే..
నిజామాబాద్, వెలుగు: ప్రజాసమస్యలను వేగంగా పరిష్కారించేందుకు లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజావాణిపై ఆఫీసర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వారం వారం వస్తున్న ఆర్జీలు మోక్షం లభించడం లేదు. సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాల్లో ఇచ్చిన దరఖాస్తులకు సరైన స్పందన ఉండడం లేదని ప్రజలు వాపోతున్నారు. సాక్షాత్తు కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్లోనూ అధికారులు అందుబాటులో ఉండడం లేదని వాపోతున్నారు.
కలెక్టర్ హెచ్చరించినా...
ప్రజావాణి వచ్చే ఫిర్యాదులను పరిశీలించిన కలెక్టర్ నారాయణరెడ్డి వాటిని ఆయా శాఖల ఆఫీసర్లకు ఫార్వర్డ్ చేస్తారు. అయితే దరఖాస్తులపై ఒక్క అధికారి కూడా స్పందించడంలేదని అర్జీదారులు ఆరోపిస్తున్నారు. రెండు మూడు సార్లు వచ్చిన ఫిర్యాదుదారు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో విధుల్లో అలసత్వం, ప్రజావాణికి గైర్హాజరు, ఆర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంపై ఆయన ఆఫీసర్లును పలుమార్లు హెచ్చరించారు. అయినా కింది స్థాయి అధికారులు, సిబ్బంది అసలు లెక్క చేయడం లేదు. జిల్లాల నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఎన్నో వ్యయప్రయాసలతో వస్తే వారికి నిరాశే మిగులుతోంది.
ప్రతి వారం 60పైనే అప్లికేషన్లు
ప్రజావాణిలో ప్రతి వారం దాదాపు 60పైగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ లెక్కన నెలకు 240, ఆరు నెలలుగా సుమారు 1,250 ఆర్జీలు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారం 95 అర్జీలు వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. ఇందులో ప్రధానంగా ధరణిలో తప్పులు నమోదు, భూ సమస్యలు, ఫించన్లపై దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. సంబంధిత అధికారులకు కలెక్టర్ రెఫర్ చేసినా.. ఇందులో దాదాపు 70 శాతం దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.