భారత్తో ట్రేడ్​ డీల్పై తొందరేమీ లేదు.. అమెరికా దిగుమతులపై 100 శాతం టారిఫ్​ తగ్గిస్తుంది: ట్రంప్​

భారత్తో ట్రేడ్​ డీల్పై తొందరేమీ లేదు.. అమెరికా దిగుమతులపై 100 శాతం టారిఫ్​ తగ్గిస్తుంది: ట్రంప్​
  • భారత్, పాక్​ మధ్య మధ్యవర్తిత్వం అతిపెద్ద విజయం
  • ఇరుగు పొరుగుదేశాల మధ్య కోపం మంచిది కాదు 
  • సీజ్​ఫైర్​ కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు వెల్లడి

న్యూయార్క్​:  తమ దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై భారత్​ 100 శాతం సుంకాలు తగ్గిస్తుందని అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్ అన్నారు. త్వరలోనే భారత్, అమెరికా మధ్య ట్రేడ్​ డీల్​ జరగనున్నదని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్​లు విధించే దేశాల్లో ఇండియా కూడా ఒకటని పేర్కొన్నారు.  అయితే, ఈ డీల్​ కోసం తాము తొందరపడడం లేదని వ్యాఖ్యానించారు. 

పశ్చిమాసియా దేశాల పర్యటన సందర్భంగా శుక్రవారం ట్రంప్​ ఫాక్స్​న్యూస్​ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అమెరికాతో డీల్​కోసం ప్రపంచంలోని దేశాలన్నీ ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ‘‘దక్షిణ కొరియా ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నది. కానీ నేను అందరితో ఒప్పందాలు చేసుకోవడం లేదు. పరిమితిని నిర్ణయించబోతున్నా. మరికొన్ని ఒప్పందాలు చేసుకుంటా. 

మాతో డీల్​ చేసుకోవాలనుకునే 150 దేశాల జాబితా నా దగ్గర ఉన్నది” అని తెలిపారు. భారత్‌‌--–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్‌‌  పదేపదే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. కాగా, ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్​ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్​ స్పందించిన విషయం తెలిసిందే. ట్రేడ్​డీల్​పై భారత్​, అమెరికా మధ్య చర్చలు నడుస్తున్నాయని, అవి సంక్లిష్ట చర్చలు అని పేర్కొన్నారు.  వాణిజ్య ఒప్పందం పరస్పరం ప్రయోజనకరంగా ఉండాలని, అది జరిగేవరకు దాని గురించి ప్రకటన చేయడం తొందరపాటే అవుతుందని అన్నారు. 

సీజ్​ఫైర్ క్రెడిట్​ తీసుకోవట్లే

భారత్, పాక్​మధ్య మధ్యవర్తిత్వం నడపడం అతిపెద్ద విజయమని ట్రంప్​ వ్యాఖ్యానించారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య కోపం మంచిదికాదని అన్నారు. ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగకుంటే అణు యుద్ధానికి దారితీసేదని ఆందోళన వ్యక్తంచేశారు. భారత్, పాక్​ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. 

‘‘ఈ సీజ్​ఫైర్​క్రెడిట్​ నేను తీసుకోవడం లేదు. కానీ భారత్, పాకిస్తాన్‌‌ మధ్య  తలెత్తిన సమస్య సద్దుమణగడానికి సాయం చేశా. ఇంకా ఎన్నేండ్లు ఈ సమస్యపై పోరాటం చేస్తారు? నేను ఏ సమస్యనైనా పరిష్కరిస్తా. వారిని కలిపి వారి సమస్యకు పరిష్కారం అయ్యేలా చూస్తా” అని అన్నారు. కాగా, భారత్, పాక్​మధ్య నెలకొన్న ఉద్రిక్తతను 
తగ్గించేందుకు మధ్యవర్తిత్వం నడిపినట్లు ట్రంప్​ చెప్పడం  వారం రోజుల్లో ఇది ఏడోసారి కావడం గమనార్హం.