రాష్ట్రంలో సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఎలాంటి సామాజిక, మత కార్యక్రమాలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. కరోనా సంక్షోభమే ఇందుకు కారణమని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో దీనిపై చర్చించి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు శనివారం, ఆదివారం మార్కెట్లను మూసివేయడంతో సహా ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
మార్కెట్లను వారానికొకసారి మూసివేసేటప్పుడు అన్ని జిల్లాల్లో ఇంటెన్సివ్ శుభ్రతను, ఫాగింగ్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. కరోనా వైరస్ వ్యాప్తిని బ్రేక్ చేసేందుకు ఇటువంటి చర్యలు తప్పవన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి దగ్గర నుంచి పోలీసులు మార్చి చివరివారం నుంచి ఇప్పటివరకు రూ. 70 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు.