గౌహతి: సిటిజన్షిప్ (సవరణ) బిల్లును వ్యతిరేకిస్తూ నార్త్ఈస్ట్(ఈశాన్య) రాష్ట్రాల్లో (మణిపూర్ మినహా) మంగళవారం బంద్ జరిగింది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 11 గంటలపాటు బంద్ కొనసాగింది. ఏడాదికి ఒకసారి జరిగే కార్నివాల్ ముగింపు సందర్భంగా నాగాలాండ్ను మాత్రం బంద్ నుంచి మినహాయించారు. బంద్ కారణంగా టూరిస్టులు ఇబ్బంది పడ్డారు. అస్సాంలో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, నార్త్ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. లెఫ్ట్పార్టీలకు చెందిన యూనియన్లు కూడా దీనిలో పాల్గొన్నాయి. బెంగాళీలు ఎక్కువమంది ఉన్న బారాక్ వ్యాలీ మినహా మిగిలిన చోట్ల బంద్ ప్రభావం కనిపించింది. గౌహతిలో బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. షాపులు, మార్కెట్లు మూతపడ్డాయి. బిల్లును వ్యతిరేకిస్తూ సిటీలో నినాదాలు చేశారు. రైళ్లు తిరగలేదు. అస్సాం ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కళాకారులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు.
మేఘాలయ బంద్
మేఘాలయలో షాపులు, మార్కెట్లు, స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. గవర్నమెంట్ ఆఫీసులకు కేవలం 10 శాతం మంది మాత్రమే హాజరైనట్టు అధికారులు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాలను దింపారు. రాజధాని షిల్లాంగ్ లో ఆందోళనకారులు పోలీసుల వెహికిల్ను ధ్వంసం చేశారు.
త్రిపురలో మార్కెట్కు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
అగర్తలా: త్రిపుర ధాలై జిల్లాలోని మనుఘాట్ లో నాన్ ట్రైబల్స్ కు చెందిన మార్కెట్కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ట్రైబల్ ప్రాంతాల్లో బంద్ ప్రభావం బాగా కనిపించింది. ధాలై, వెస్ట్ త్రిపుర, ఖోవై జిల్లాల్లో జనం బయటకు రాలేదు. గవర్నమెంట్ ఆఫీసులకు కూడా తక్కువ మంది హాజరయ్యారు. ట్రైన్ సర్వీసులు ఆగిపోయాయి. రోడ్ల మీద ఎలాంటి వెహికిల్స్ తిరగలేదు.
రాజ్భవన్ ఎదుట స్టూడెంట్స్ ఆందోళన
కోహిమా: సిటిజన్షిప్ బిల్లును వ్యతిరేకిస్తూ కోహిమాలోని రాజ్భవన్ ఎదుట నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్(ఎన్ఎస్ఎఫ్) మంగళవారం ధర్నా చేసింది. హార్నిబిల్ ఫెస్టివల్ ను పురస్కరించుకుని నాగాలాండ్కు బంద్ నుంచి మినహాయింపు నిచ్చారు. అయినప్పటికీ ఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు గవర్నర్ ఇంటి దగ్గర ఆందోళన చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బిల్లును వ్యతిరేకించిన సైంటిస్టులు, స్కాలర్లు
న్యూఢిల్లీ: దేశవిదేశాలకు చెందిన వెయ్యి మంది ఈ బిల్లును వ్యతిరేకించారు. బిల్లును విత్డ్రా చేసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ సైంటిస్టులు, స్కాలర్లు ఆన్లైన్లో ఒక స్టేట్మెంట్ను రిలీజ్ చేశారు. “సవరణ బిల్లులో పౌరసత్వానికి ప్రామాణికంగా మతాన్ని ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధం” అని ఆ స్టేట్మెంట్లో చెప్పారు. హార్వార్డ్, మసాచూస్సేట్స్, ఐఐటీ, ఢిల్లీ యూనివర్సిటీ, చెన్నై మ్యాథ్స్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలకు చెందిన స్కాలర్లు సంతకం చేసిన వారిలో ఉన్నారు.
శ్రీలంక తమిళులకూ పౌరసత్వం ఇవ్వాలి: శ్రీశ్రీ
చెన్నై: సిటిజన్షిప్ బిల్లుపై ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్ రియాక్ట్ అయ్యారు. శ్రీలంక నుంచి వచ్చి స్థిరపడిన తమిళ శరణార్థులకు కూడా పౌరసత్వం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ట్విటర్ వేదికగా కోరారు. దాదాపు లక్ష మందికి పైగా శ్రీలంక తమిళులు 30 ఏళ్లుగా దేశంలో నివసిస్తున్నారని, వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ప్రముఖ తమిళ కవి వీరముత్తు కూడా ఇదే విన్నపం చేశారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వ రిహేబిలిటేషన్ సెంటర్లు సహా తమిళనాడు రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో శ్రీలంక తమిళులు నివసిస్తున్నారు.
జోధ్పూర్లో సంబురాలు
జోధ్పూర్: సిటిజన్షిప్ బిల్లు ఆమోదం పొందడంతో పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ వలస వాదులు సంబురాలు చేసుకున్నారు. దీనివల్ల తమకు ఇండియా పౌరసత్వం లభిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందాలని కోరుకుంటున్నారు. ‘ప్రభుత్వం మాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఇండియాలో గౌరవ ప్రదంగా జీవించడానికి అవకాశం కల్పించిన బీజేపీ ప్రభుత్వానికి, హోం మంత్రి అమిత్షాకు థ్యాంక్స్’ అని 2005లో పాక్ నుంచి రాజస్థాన్లోని జోధ్పూర్కు వచ్చి తర్వాత సిటిజన్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రేమ్చంద్ అనే వ్యక్తి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ బిల్లు వల్ల ఎందరో వలసదారులు పౌరసత్వానికి అర్హత పొందుతారని సీమంత్లోక్ సంఘటన్ ప్రెసిడెంట్ హిందూ సింగ్ శోధ అన్నారు.