విద్వేషాలను ప్రోత్సహించే యాంకర్లపై ఎందుకు చర్యలు తీసుకోరు : సుప్రీంకోర్టు

విద్వేషాలను ప్రోత్సహించే యాంకర్లపై ఎందుకు చర్యలు తీసుకోరు : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : వార్తల ప్రసారంలో ఛానళ్ల తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కొన్ని విషయాల్లో అవి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ సమాజాన్ని చీలుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్వేష ప్రసంగాలు సమాజం పాలిట పెను ప్రమాదంగా మారాయని జస్టిస్ కేఎం. జోసెఫ్, జస్టిస్. బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకట్ట వేయాల్సిందేనని స్పష్టం చేసింది. వార్తా ప్రసారాల విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించే ఛానళ్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం కేంద్రాన్ని  ఆదేశించింది. 

సమస్యలో భాగమవుతున్న యాంకర్లు 

టీఆర్పీ రేటింగులు సాధించడమే టీవీ ఛానళ్ల లక్ష్యంగా మారిపోయిందని, అందుకోసం ప్రతి వార్తను సంచలనంగా మారుస్తున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. టీవీల్లో నిర్వహించే లైవ్ చర్చల్లో చాలాసార్లు యాంకర్లు సమస్యలో భాగం అయిపోతున్నారని చెప్పింది. ప్యానల్ లోని వ్యక్తులు మాట్లాడుతుండగానే ఇష్టానుసారం మ్యూట్ చేస్తూ వారి వాదనలు వినిపించే అవకాశం లేకుండా  చేస్తున్నారని విమర్శించింది. న్యూస్ పేపర్ల కన్నా టీవీ ఛానళ్లు అత్యంత శక్తివంతమైనవన్న ధర్మాసనం అవి ప్రేక్షకుల్ని  ఎంతో ప్రభావితం చేస్తున్నాయని చెప్పింది. ప్రేక్షకుల్లో చాలా మంది పరిణితి లేనివాళ్లు కావడంతో ఆ ప్రసారాలను చూసి రెచ్చిపోకుండా ఉండలేకపోతున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 

యాంకర్లదే బాధ్యత

న్యూస్ పేపర్లకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలాగే టీవీ ఛానళ్లకు నియంత్రణ వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరమని జస్టిస్ జోసెఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్వేష వ్యాఖ్యల వ్యాప్తికి కారణమవుతున్న న్యూస్ యాంకర్లను లైవ్ నుంచి ఎందుకు తప్పించకూడదని ప్రశ్నించారు. ప్రత్యక్ష ప్రసారాల్లో చర్చలు సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత యాంకర్దేనని, ప్యానల్ లోని వ్యక్తుల్ని మ్యూట్ చేయడం లేదా ప్రశ్నలు అడగకపోవడం పక్షపాతమే అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.  ఇలా వ్యవహరించిన ఎంత మంది యాంకర్లపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న యాంకర్లు తోచినట్లుగా మాట్లాడొద్దని హితవు పలికింది.