పాకిస్థాన్ అణు పితామహుడిగా పేరొందిన న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ అబ్దుల్ ఖాదీర్ ఖాన్ ఈ రోజు ఉదయం మరణించారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ కొన్నాళ్లుగా ఇస్లామాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖాదీర్ (85) ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంతాపం ప్రకటించారు. ఖాదీర్ మృతి ఎంతో బాధ కలిగించిందన్నారు ఆరిఫ్. 1982 నుంచి తనకు పర్సనల్గా తెలుసని, అణ్వాయుధాన్ని డెవలప్ చేసిన ఆయన పాక్ను కాపాడుకునేందుకు సాయం చేశారంటూ ట్వీట్ చేశారు. ఆయన సేవలకు పాక్ ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు.
పుట్టింది భోపాల్లో..
అబ్దుల్ ఖాదీర్ ఖాన్ పుట్టింది భారత్లోనే.. 1936లో భోపాల్లో జన్మించారాయన. అయితే 1947లో స్వాతంత్ర్యం వచ్చాక దేశ విభజన సందర్భంగా ఖాదీర్ కుటుంబం పాకిస్థాన్కు వెళ్లిపోయింది. న్యూక్లియర్ సైన్స్ చదివిన ఆయన.. పాకిస్థాన్ తొలి అణు బాంబు తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన పాక్ అణు పితామహుడిగా పాపులర్ అయ్యారు. ఆగస్టు 26న కరోనా బారినపడిన ఆయన ఖాన్ రీసెర్చ్ లాబోరెటరీస్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అక్కడి నుంచి రావల్పిండి మిలటరీ హాస్పిటల్కు మార్చారు. పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్ అయిన ఆయన ఇటీవల ఊపిరితిత్తుల సమస్యలతో మళ్లీ ఇస్లామాబాద్లో ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇవాళ ఉదయం ఆయన మరణించారు.