రాజ్యసభలో ఎన్డీయే సంఖ్యా బలం నెమ్మదిగా పెరుగుతోంది. టీడీపీకి చెందిన నలుగురు, ఇండియన్ నేషనల్ లోక్దళ్కు చెందిన రాజ్యసభ ఎంపీ ఒకరు ఈమధ్యనే బీజేపీలో చేరారు. ఈ ఐదుగురు ఎంపీల చేరికతో ఈనెల ఐదో తేదీనాటికి రాజ్యసభలో ఎన్డీయే బలం సగానికి చేరుకోనుంది. కీలకమైన హాఫ్ మార్క్ దాటితే మోడీ సర్కార్ ప్రవేశపెట్టే పలు ముఖ్యమైన బిల్లులకు ఎలాంటి అడ్డంకుల్లేకుండా క్లియరెన్స్ లభిస్తుంది. రాజ్యసభ ప్రస్తుతం సభ్యుల సంఖ్య 235 (10 ఖాళీలున్నాయి ). జూన్30 నాటికి ఎన్డీయేకు 111 మంది ఎంపీలున్నారు. ఈనెల ఐదునాటికి ఈ బలం 115కి చేరుతుంది. అయినప్పటికీ అప్పటికి 241 సభ్యులున్న సభలో ఎన్డీయే హాఫ్ మార్క్చేరుకోవాలంటే మరో ఆరు సీట్లు అవసరం అవుతాయి. రాజ్యసభలో మొత్తం 245 సీట్లున్నాయి. సొంతంగా మెజార్టీ కావాలంటే ఏ పార్టీకైనా 123 సభ్యులుండాలి. టీఆర్ఎస్, బీజేడీ, వైఎస్ఆర్సీపీ లాంటి నాన్-యూపీఏ పార్టీలు మద్దతుంటే ఈ కరెంట్ సెషన్లోనూ ఎన్డీయే ప్రవేశపెట్టిన బిల్లులకు ఆమోదం లభించడం పెద్ద కష్టమేమీకాదు.
ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి రాజ్యసభలో బిల్లులు పాస్ కావడానికి తమకు పెద్దగా ఆటంకాలు ఉండవని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ లాంటి బిల్లుల ఆమోదం మాత్రం ఎన్డీయేకు సవాలేనని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న జనతాదళ్ (యూ) ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీకి రాజ్యసభలో ఆరుగురు ఎంపీలున్నారు. బీజేడీ, వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు ఇలాంటి కీలక బిల్లులపై ఓటింగ్ జరిగే సమయంలో తటస్థంగా ఉండే అవకాశముందని అంటున్నారు. కీలక బిల్లుల ఆమోదం కోసం నాన్-యూపీఏ పార్టీల మద్దతుతీసుకుంటామని, దాని కోసం ఆపార్టీ నాయకులతో కాంటాక్ట్లో ఉంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈనెల ఐదు నాటికి రాజ్యసభలో ఆరు సీట్లు ఖాళీ అవుతున్నాయి. బీహార్ నుంచి ఖాళీ అయిన సీటు నుంచి కేంద్రమంత్రి, లోక్ జనశక్తిపార్టీ చీఫ్ రామ్ విలాస్ పాశ్వాన్ ఎన్నికైయ్యారు. గుజరాత్ నుంచి బీజేపీ రెండు సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి. అమిత్ షా, స్మృతి ఇరానీ లోక్సభకు ఎన్నిక కావడంతో గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన వాళ్లు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఆ రెండు సీట్లు ఖాళీ అయ్యాయి.