బిజినెస్ డెస్క్, వెలుగు: మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో పాటు, యూరప్లో మళ్లీ కరోనా రెస్ట్రిక్షన్లు పెట్టే అవకాశం ఉండడంతో సెన్సెక్స్, నిఫ్టీలు 2 శాతం మేర పతనమయ్యాయి. దీంతో ఈ ఇండెక్స్లు తమ ఆల్టైమ్ హై నుంచి 12 శాతం మేర కిందకు పడినట్టయ్యింది. సాధారణంగా హైల నుంచి 10 శాతం పడితే కరెక్షన్ స్టార్టయ్యిందని అంటారు. మార్కెట్ బేర్స్ కంట్రోల్కి వెళ్లిందని, కానీ, కీలక లెవెల్స్ నుంచి ఇండెక్స్లు బౌన్స్ బ్యాక్ కావొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. సెన్సెక్స్ సోమవారం 1,190 పాయింట్లు (2.09 శాతం) నష్టపోయి 55,822 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 371 పాయింట్లు (2.18 శాతం) తగ్గి 16,614 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో సుమారు1,800 పాయింట్లు పతనమయ్యింది. నిఫ్టీ అయితే 16,410 వరకు తగ్గింది. అన్ని సెక్టార్ల ఇండెక్స్లు నష్టాల్లో క్లోజవ్వగా, పీఎస్యూ, రియల్టీ, మీడియా, మెటల్ ఇండెక్స్లయితే ఎక్కువగా నష్టపోయాయి.
మార్కెట్ ఎందుకు పడుతోందంటే..
సెన్సెక్స్, నిఫ్టీలు ఈ ఏడాది మొదటి 10 నెలల్లో 20 శాతం మేర పెరిగాయి. కరోనా డెల్టా వేరియంట్ టైమ్లో కూడా లాభపడ్డాయి. కానీ, కొత్తగా కరోనా ఒమిక్రాన్ విస్తరిస్తుండడం స్టాక్ మార్కెట్లపై నెగెటివ్ ప్రభావం చూపుతోంది. డెల్టా వేరియంట్ టైమ్లో వ్యవస్థలో లిక్విడిటీ ఉండేది. విదేశీ ఇన్వెస్టర్లు దేశ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కొనసాగుతుండేది. దీంతో డెల్టా వేరియంట్ ప్రభావం మార్కెట్లపై పెద్దగా పడలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. యూఎస్ ఫెడ్తో సహా వివిద దేశాల సెంట్రల్ బ్యాంకులు కీలక రేట్లను పెంచాలని చూస్తున్నాయి. లోకల్గా, గ్లోబల్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. దీన్ని కట్టడి చేయడానికి వడ్డీ రేట్లను పెంచి, వ్యవస్థలో లిక్విడిటీని తగ్గించాలని చూస్తున్నాయి. ఇది ఇండియా వంటి ఎమర్జింగ్ మార్కెట్లపై నెగెటివ్ ప్రభావం చూపుతోంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంచేందుకు మొగ్గు చూపుతుండడం, బాండ్ కొనుగోళ్లను తగ్గించేస్తుండడంతో మేజర్ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడుతోంది. దీంతో దేశంలో ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేసుకొని, తమ ఇన్వెస్ట్మెంట్లను మార్కెట్ నుంచి బయటకు తీసేస్తున్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో వివిధ దేశాల్లో కరోనా రిస్ట్రిక్షన్లు మళ్లీ స్టార్టవుతాయనే భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి.
రూ. 21 లక్షల కోట్లు డౌన్..
మార్కెట్లు పడుతుండడంతో ఇన్వెస్టర్ల సంపద కరిగిపోతోంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి చూస్తే ఇప్పటివరకు రూ. 21 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 274 లక్షల కోట్ల నుంచి రూ. 253 లక్షల కోట్లకు తగ్గింది. ఒక్క సోమవారం సెషన్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 6 లక్షల కోట్లు తగ్గింది. ఇంట్రాడేలో మార్కెట్ క్యాప్ రూ. 9 లక్షల కోట్ల వరకు తగ్గింది. గత 2 సెషన్లను కలుపుకుంటే రూ. 11 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు నష్టపోయారు.