
- అందులోనే అన్ని రకాల ప్రభుత్వ భూములు..
- పట్టాపాస్ బుక్లేని వ్యవసాయ భూములు
- హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి వివరాలు తెప్పించిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దాదాపు కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితాలోకి చేరనుంది. ఇందుకు సంబంధించిన లిస్ట్ను రెవెన్యూ శాఖ సిద్ధం చేసింది. క్షేత్రస్థాయి సమాచారంతోపాటు భూ భారతి పోర్టల్లో ఉన్న ఈ మొత్తం భూమిని లావాదేవీల నిమిత్తం లాక్ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో ప్రభుత్వ భూములతోపాటు కొన్ని ప్రైవేట్ పట్టా భూములు కూడా ఉన్నాయి.
హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబితాను సిద్ధం చేసింది, నిషేధిత జాబితాలోకి చేర్చడానికి ప్రతిపాదించిన భూమిని 3 ప్రధాన కేటగిరీలుగా విభజించారు. ఇందులో ప్రభుత్వ, నాలా, పట్టా పాస్బుక్ జారీ చేయని వ్యవసాయ భూములున్నాయి. ప్రభుత్వ భూముల్లో వివిధ శాఖలకు కేటాయించిన భూములతోపాటు అసైన్డ్ ల్యాండ్స్, అటవీ భూములు, నీటిపారుదల ప్రాజెక్టులకు, రోడ్లకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు కేటాయించిన భూములు, ఇంటి స్థలాలు మొదలైన రూపంలో ఉన్న ప్రభుత్వ భూముల విస్తీర్ణం దాదాపు 77 లక్షల ఎకరాలు ఉన్నట్లు తెలిసింది.
ఇది కాకుండా పార్ట్ బీలో పట్టా భూములు కొన్ని ఉన్నాయి. ఆ విస్తీర్ణం కూడా కలిపితే రాష్ట్రంలో దాదాపు కోటి ఎకరాలు నిషేధిత జాబితా భూముల్లో ఉండనుంది. వీటిపై పూర్తి అధికారం ప్రభుత్వానికే ఉంటుంది. ఎలాంటి లావాదేవీలు చేయాలన్నా, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి బదలాయింపు చేయాలన్నా కచ్చితంగా ప్రభుత్వ అనుమతి ఉండాల్సిందే. ఈ నిషేధిత జాబితా.. ప్రభుత్వ భూములను కాపాడటంలో, అక్రమ రిజిస్ట్రేషన్లను అరికట్టడంలో కీలకంగా ఉంటుంది. దీని అమలుతో రాష్ట్రంలో భూ వివాదాలు తగ్గే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది.
పట్టా పాస్బుక్ లేనివి 18 లక్షల ఎకరాలపైనే..
ప్రభుత్వ భూముల తర్వాత నిషేధిత జాబితాలో మరో కేటగిరీ పట్టా పాస్బుక్ జారీ చేయని వ్యవసాయ భూములు. ఈ కేటగిరీ కింద 18 లక్షల ఎకరాల పైన భూమి ఉంది. దీనికి సంబంధించి 11 లక్షలకుపైగా ఖాతాలున్నాయి. భూ భారతిలో లావాదేవీలు జరగాలంటే పాస్బుక్ తప్పనిసరి కాబట్టి.. ఈ భూములు కూడా ప్రస్తుతానికి నిషేధిత జాబితాలో కొనసాగనున్నాయి. నాలా భూములు అంటే వ్యవసాయ భూములను కన్వర్ట్ చేసుకున్న విస్తీర్ణం 3 లక్షల ఎకరాల పైగా ఉన్నది. నిషేధిత భూముల జాబితా అస్తవ్యస్తంగా ఉండటంపై గతంలో హైకోర్టు పలు సందర్భాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భూమికి సంబంధించిన అన్ని రికార్డులను క్షేత్రస్థాయి నుంచిసేకరించి, అత్యంత పారదర్శకంగా ఒక సమగ్ర జాబితాను రూపొందించాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖ.. జిల్లా స్థాయి నివేదికలు, సమగ్ర నివేదికను భూ భారతి పోర్టల్ ఆధారంగా సిద్ధం చేసింది.
లావాదేవీలు జరపకుండా లాక్!
నిషేధిత జాబితాలో చేర్చిన భూములపై ఎలాంటి అక్రమ లావాదేవీలు జరగకుండా నిరోధించేందుకు రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. ఈ మొత్తం భూమిని భూ భారతి పోర్టల్లో నిషేధిత జాబితాలో శాశ్వతంగా లేదా తాత్కాలికంగా లాక్ చేసే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇప్పటికే వీటిలో చాలా భూములు ఆ జాబితాలోనే ఉన్నాయి. అయితే, కోర్టు ఆదేశాలతో మళ్లీ అన్ని రకాలుగా పరిశీలించి.. కొత్త జాబితా సిద్ధం చేశారు. దీంతో ప్రభుత్వ భూములను లేదా వివాదాస్పదంగా ఉన్న ప్రైవేట్ భూములను ఇతరుల పేరు మీద రిజిస్టర్ చేయడం అసాధ్యమవుతుంది.
]భూ భారతి పోర్టల్లో భూమి విస్తీర్ణం 2.50 కోట్ల ఎకరాల పైన ఉన్నది. ఇందులో 1.53 కోట్లఎకరాల వ్యవసాయ భూమికి పట్టా పాస్బుక్లు జారీ చేశారు. ఈ భూమి చట్టబద్ధమైన లావాదేవీలకు అందుబాటులో ఉంటుంది. అయితే, పట్టా పాస్బుక్ జారీ చేయని పార్ట్ బీ, ప్రభుత్వ భూములు, నాలా భూములు, అటవీ, ఎండోమెంట్ ఇతర శాఖల కింద ఉన్న భూములు, ఇతరత్రా వంటివి దాదాపు కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితాలోకి చేరుతుంది.