జ్యోతినగర్, వెలుగు : తెలుగు మ్యాట్రిమోనిలో ఓ అమ్మాయి ఫొటో, ఫేక్ ప్రొఫైల్ పెట్టి పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ శాంతినగర్ కు చెందిన ఒకరి దగ్గర లక్షలు వసూలు చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్టీపీసీ పీఎస్లో ఈ వివరాలను పెద్దపల్లి డీసీపీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన కోమలి సూర్య ప్రకాశ్( 30 ) జూదం, జల్సాలకు అలావాటు పడి మ్యాజిక్ కాల్ యాప్తో ఆడవారి గొంతుతో మాట్లాడుతూ మోసాలు చేసేవాడు. ఇతడు తెలుగు మాట్రిమోనిలో దివ్య శ్రీ పేరుతో ఓ అమ్మాయి ఫొటో పెట్టి తప్పుడు వివరాలు నమోదు చేశాడు. పెండ్లి కోసం చూస్తున్న ఎన్టీపీసీకి చెందిన మూడెత్తుల సురేష్ యాదవ్ ఈ ప్రొఫైల్ చూసి రిక్వెస్ట్ పంపించాడు. దీంతో సూర్యప్రకాశ్దివ్యశ్రీ పేరుతో చాట్చేయడం మొదలుపెట్టాడు. తర్వాత తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. అయితే సూర్యప్రకాశ్ నార్మల్ కాల్ మాట్లాడకుండా మ్యాజిక్ కాల్ యాప్తో ఒకసారి దివ్యశ్రీ తండ్రినంటూ, మరోసారి అమ్మను అంటూ, చెల్లెలు, అక్కలా గొంతు మార్చి మాట్లాడేవాడు. తన కుటుంబసభ్యులు పెండ్లికి ఒప్పుకున్నారని నమ్మించాడు. తన తండ్రికి ఆరోగ్యం బాగా లేదని, హాస్పిటల్కు తీసుకువెళ్లాలని, ఇలా పలు కారణాలు చెబుతూ సురేశ్నుంచి తన అకౌంట్కు నెలరోజుల్లో రూ.8 లక్షలు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు.
విజయవాడకు పిలిచి ఫోన్ స్విచ్ఛాప్ పెట్టడంతో..
అయితే వాట్సాప్ కాల్ మాట్లాడాలని సురేశ్ అడుగుతున్నా దాటవేస్తూ వచ్చేవాడు. ఒకసారి విజయవాడకు రమ్మని పిలిచి ఫోన్ స్విచ్ఛాప్ పెట్టుకున్నాడు. దీంతో సురేశ్ కు అనుమానం వచ్చింది. మళ్లీ ఒకరోజు ఫోన్ చేసి గోవాకు వెళ్దామని, తన బాబాయి వస్తాడని అతడికి రూ. 2 లక్షలు ఇవ్వాలని సూర్యప్రకాశ్ కోరాడు. దీనికి ఒప్పుకున్నట్టు నటించిన సురేశ్ ఎన్టీపీసీకి పంపించాలని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సూర్యప్రకాశ్ అతడి బాబాయిలా ఈ నెల 29న గౌతమినగర్ చౌరస్తాకు వచ్చాడు. ఫోన్ చేయగా అటోలో ఉన్న సూర్య ప్రకాశ్(దివ్య శ్రీ )ని చాకచక్యంగా పట్టుకున్నారు. అతడి దగ్గర రూ.14 లక్షలను సీజ్ చేశారు. ఇలాగే ఒడిసాకు చెందిన ఓ ఆర్మీ జవాన్నుంచి సూర్యప్రకాశ్ రూ.12 లక్షలు వసూలు చేశాడని డీసీపీ చెప్పారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సిబ్బందికి రివార్డులు అందజేశారు. గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్,రామగుండం సీఐ కణతల లక్ష్మీనారాయణ.ఎన్టీపీసీ ఎస్సై జీవన్, ఎస్ఐ కుమార్ ఉన్నారు.