- ఆన్లైన్లో క్యాసినో బెట్టింగ్లు
- ఇద్దరు బుకీలు, పంటర్ అరెస్ట్
- రూ.74.8లక్షల నగదు సీజ్
హైదరాబాద్,వెలుగు: ఆన్లైన్ క్యాసినో బెట్టింగ్ ముఠా పట్టుబడింది. మల్కాజిగిరి అడ్డాగా దందా చేస్తుండగా రాచకొండ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం రైడ్ చేశారు. ఇద్దరు బుకీలు, పంటర్ ను అరెస్ట్ చేసి, వారి వద్ద రూ.53 లక్షల డబ్బు, రూ.21.8 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఫ్రీజ్ చేశారు. వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. సికింద్రాబాద్ పరిధి తిరుమలగిరికి చెందిన చున్నం కిరణ్(40) ఎంబీఏ చదివాడు. 2003లో యూకే, శ్రీలంకలోని రెస్టారెంట్స్లో జాబ్ చేస్తూనే, క్యాసినో క్లబ్స్లో అబ్జర్వర్గా చేరి ఆన్లైన్ బెట్టింగ్ సైట్లపై స్టడీ చేశాడు. రూ.20లక్షలు చెల్లించి ఆన్లైన్ క్యాసినో, పోకర్, బింగో ఏజెంట్గా జాయిన్ అయ్యాడు. శ్రీనిధి సాఫ్ట్ బైట్ పేరుతో బెంగళూరులోని యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేశాడు. బెట్టింగ్ యాప్స్,ఇన్స్టాగ్రామ్లో పంటర్స్ను 30 నుంచి 70% కమీషన్ బేసిస్తో పెట్టుకున్నాడు. క్యాసినో బెట్టింగ్ కోసం శ్రీలంక, యూకే, గోవా వెళ్తుండేవాడు.
నేపాల్ యువతులతో కాల్ సెంటర్
గోవాలో ఫేమస్'ఎన్'బుకీలను కలిసిన తర్వాత దేశ వ్యాప్తంగా నెట్వర్క్ డెవలప్ చేశాడు. ఆన్లైన్ క్యాసినో తెలిసిన నలుగురు నేపాల్ యువతులతో కలిసి మూసాపేట్ రెయిన్బో విస్టాస్లో కాల్సెంటర్ ఓపెన్ చేశాడు. టెలిగ్రామ్ యాప్తో పంటర్లను ట్రాప్ చేసేవాడు. తిరుమలగిరి ఎస్పీ నగర్కి చెందిన తన ఫ్రెండ్ సయ్యద్అక్వీల్ అహ్మద్ (38)తో కలిసి వెయ్యి మందికి పైగా పంటర్లను బెట్టింగ్ సైట్లో యాడ్ చేయించాడు. ఇలా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 35 మంది పంటర్స్ ఆన్లైన్ క్యాసినోలో బెట్టింగ్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కుషాయిగూడ గణేష్నగర్కి చెందిన వ్యాపారి అనెగు సురేందర్రెడ్డి (32) ని బెట్టింగ్ పంటర్గా ఉండి క్యాసినోలో రూ.15లక్షలు కోల్పోయాడు. మళ్లి బెట్టింగ్స్ పెడుతుండగా సమాచారం తెలుసుకుని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం రైడ్ చేసి ముగ్గురుని అరెస్ట్ చేశారు.