
- జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్నవి నాలుగు సంఘాలే
- గుర్తింపు లేని సంఘాలకూ ఓడీ ఇచ్చిన సర్కార్
- టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్నం చేసుకునేందుకే అని విమర్శ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని టీచర్ల సంఘాలను మళ్లీ మచ్చిక చేసుకునే పనిలో సర్కారు పడింది. దీనికోసం ఇష్టారాజ్యంగా పలు సంఘాలకు ఓడీ (అదర్ డ్యూటీ) ఇచ్చేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఓడీ ఎలా ఇచ్చారనే దానికి ఓ లెక్కాపత్రం కనిపించడం లేదు. ఇదంతా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కోసమే అనే వాదనలూ వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 8 టీచర్ యూనియన్లకు గతంలో సర్కారు గుర్తింపు ఇచ్చింది. దీంట్లో పీఆర్టీయూ, టీఎస్యూటీఎఫ్, ఎస్టీయూటీఎస్, టీఆర్టీఎఫ్ (ఏపీటీఎఫ్)లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వ సంఘాలుగా ఉన్నాయి. వీటితో పాటు టీపీటీఎఫ్, హెచ్ఎం అసోసియేషన్, తపస్, ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ సంఘాలకు సర్కారు గుర్తింపు ఉంది. గతంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వమున్న యూనియన్ల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ప్రభుత్వం ఓడీ సౌకర్యం ఇచ్చేది. దీంతో వాళ్లు బడికి పోవాల్సిన అవసరం లేకుండా, యూనియన్ కార్యక్రమాలకు వెళ్లే చాన్స్ ఉంటుంది. గుర్తింపున్న యూనియన్ల ప్రెసిడెంట్, సెక్రటరీలకు ఏటా 21రోజుల యూనియన్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకూ బదిలీల్లో పాయింట్లుంటాయి. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను రెన్యువల్ చేయలేదు. అయితే అప్పుడప్పుడు గుర్తింపు సంఘాలకు ప్రాధాన్యత ఇచ్చి, పలు సమస్యలపై విద్యాశాఖ అధికారులు వారి నుంచి సలహాలు, అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
ఓడీ 10 సంఘాలకు..
రాష్ట్రంలో లక్షకు పైగా సర్కారు టీచర్లుండగా, 50కి పైగా సంఘాలున్నాయి. వీటిలో పీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీయూ, టీపీటీఎఫ్, టీటీయూ, టీపీఆర్టీయూ, టీయూటీఎఫ్, ఆర్యూపీపీ, హెడ్మాస్టర్స్ అసోసియేషన్ కు ఓడీ ఇవ్వగా, తాజాగా మరో సంఘం టీఆర్టీఎఫ్కు సర్కారు ఓడీ ఇచ్చింది. మూడేండ్ల నుంచి ఒక్క పీఆర్టీయూకి మినహా మిగిలిన అన్ని సంఘాలకు ఈ మధ్యే ప్రభుత్వం ఈ సౌకర్యం ఇచ్చింది. అయితే తపస్ సంఘానికి సర్కా రు గుర్తింపు ఉన్నా.. ఓడీ సౌకర్యం మాత్రం ఇవ్వలేదు. బీజేపీకి అనుబంధంగా ఉంటుందనే తపస్ను పక్కన పెట్టినట్టు సమాచారం. అయితే అదర్ డ్యూటీ (ఓడీ) ఉండాలంటే తప్పనిసరిగా మొత్తం టీచర్లలో కనీసం15 నుంచి 20శాతం సభ్యత్వం ఉండాలి. దీంతో పాటు అకౌంట్స్, సమావేశాల మినిట్స్ మెయిన్టెన్ చేయాల్సి ఉంది. మూడు, నాలుగు సంఘాలే వీటిని అమలు చేస్తున్నట్టు యూనియన్ లీడర్లు చెబుతున్నారు. వీటిలో కొన్ని సంఘాలకు సగం జిల్లాల్లో కమిటీలు లేకపోవడం గమనార్హం. సగం సంఘాల్లో ఐదు వేలలోపే సభ్యత్వాలు ఉన్నాయని యూనియన్ లీడర్లే చెప్తున్నారు.
ఓడీ ఆధారంగా కమిటీలేస్తున్న సంఘాలు
ప్రస్తుతం ఓడీ ఆధారంగా కొన్ని సంఘాలు కమిటీలు వేస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతల ద్వారా ఓడీలు తెచ్చుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. సంఘాలకు సభ్యత్వం ఎంత ఉంది? ఎన్ని జిల్లాల్లో కమిటీలు ఉన్నాయి? అనే వివరాలూ విద్యాశాఖ అధికారులు సేకరించడం లేదు. ఇష్టారీతిన చిన్నచిన్న సంఘాలకూ ఓడీలు ఇస్తుండటంతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టీచర్లకు ఓడీ సౌకర్యం ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని యూనియన్ నేతలు చెప్తున్నారు.