- ధరణితో మోసపోయామంటూ ఎన్హెచ్–44 పై
- పోలీసులు వెళ్లగొట్టడంతో తహసీల్దార్ఆఫీసు ఎదుట బైఠాయింపు
బాలానగర్, వెలుగు : ‘మా భూములను ధరణిలో వేరే వాళ్ల పేరుపై మార్చిన్రు. వెంటనే మా పేరు మీదికి మార్చకపోతే ఉరేసుకుని చస్తాం’ అంటూ మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం హేమాజీపూర్ గ్రామానికి చెందిన రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. 'ధరణి'లో ఉన్న తమ భూములను తమ పేరుపై కాకుండా ఇతరుల పేరు ఎక్కించడాన్ని నిరసిస్తూ నేషనల్ హైవే -44పై బైఠాయించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని రైతులను అక్కడి నుంచి పంపించివేశారు. తర్వాత అందరూ తహసీల్దార్ఆఫీస్ కు వెళ్లి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 262 నుంచి 272 వరకు ఉన్న సర్వే నంబర్లలో వంద మందికి 220 ఎకరాల భూమి ఉందని, దీన్నంతా 'ధరణి'లో వేరే వారి పేరు మీదకు మార్చారని ఆరోపించారు.
వారు ఆ భూములను వారి వారసుల మీద విరాసత్ చేసి ఇతరులకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికీ 30 సార్లు కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే, తహసీల్దార్ వద్దకు వెళ్లండని చెబుతున్నారని.. తహసీల్దార్ దగ్గరకు వెళ్తే ఆర్డీఓ వద్దకు వెళ్లండని సమాధానం ఇస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే 'ధరణి' వ్యవస్థను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూలో ఉన్న రికార్డుల ప్రకారం తమ భూములను తమకు ఇప్పించి, కొత్త పాస్బుక్స్జారీ చేయాలని తహసీల్దార్ను కోరారు. స్పందించిన ఆయన విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.