- నష్టాలు భరించలేక బార్లు అమ్ముకుంటున్రు
- రాష్ట్రంలో వందకు పైగా బార్లు సేల్.. త్వరలో మరో 200
- కరోనా భయంతో కస్టమర్లు రాక కష్టాల్లో ఓనర్లు
- పైసల్లేక ఫీజు కట్టకపోవడంతో లైసెన్స్ రద్దు చేస్తున్న సర్కారు
- రౌండింగ్ ఫిగర్, లిక్కర్పై మార్జిన్ తగ్గింపుతోనూ నష్టాలు
హైదరాబాద్, వెలుగు: బార్ అంటనే సుక్క, ముక్కతో మస్త్ ఎంజాయ్ చేస్తరు. ఆరామ్ సే ఇష్టమున్నంత సేపు కూర్చొని తాగుతరు. స్టఫ్కుఏది కావాలంటే అది దొరుకుతది. చికెన్, ఫిష్, మటన్, ఎగ్ ఇట్ల అన్నీ ఉంటయి. తిన్నకాడికి తింటరు. ఇట్ల కస్టమర్లతో మస్తు హడావుడి ఉంటది. బార్ రోజూ నిండుగ కానొస్తది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కరోనాతో కస్టమర్లు లేక బార్లు వెలవెలబోతున్నాయి. బార్ల నిర్వహణే భారంగా మారింది. లాభాలు దేవుడెరుగు నష్టాలు రావడంతో ఓనర్లు వడ్డీలకు అప్పులు తెచ్చికడుతున్నరు. ఇగ గిట్టుబాటు కాకపోవడంతో కొందరైతే బార్లను అమ్ముకుంటున్నరు. ఇంకొందరు అమ్మే ప్రయత్నాల్లో ఉన్నారు. లైసెన్స్ ఫీజు కట్టకపోవడంతో కొన్ని బార్లను సర్కారే తీసేసుకుంది. కరోనా తర్వాత 20 శాతానికిపై స్పెషల్ ట్యాక్స్ విధించడం, ఎమ్మార్పీపై రౌండింగ్ ఫిగర్, లిక్కర్పై మార్జిన్ తగ్గింపుతో బార్ ఓనర్లకు కోలుకోలేని దెబ్బపడింది.
కరోనాతో నో గిరాకీ..
కరోనాతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతేడాది మార్చి నుంచి అక్టోబర్ వరకు బార్లు మూతపడ్డాయి. వైన్స్లకు ముందే అనుమతి ఇచ్చినా బార్లకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. గతేడాది అక్టోబర్లో బార్లు తెరిచినా.. గిరాకీ రావడం లేదు. కరోనా భయంతో బిజినెస్ పెరగడం లేదు.బార్లకు వచ్చేందుకు మందు వినియోగదారులు కూడా జంకుతున్నారు. ఈ నేపథ్యంలో బార్లు జనాలు లేక వెలవెలబోతున్నాయి. కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నా.. కస్టమర్లు బార్లవైపు చూస్తలేదు. ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. అనేక మంది వైన్సుల్లోనే మద్యం కొని ఇంటికి తీసుకెళ్లి తాగుతున్నారు.
100కుపైగా బార్లు అమ్ముకున్రు..
రాష్ట్రంలో ఇప్పటికే 1,052 బార్లు ఉండగా, ఇటీవల కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రభుత్వం 159 కొత్త బార్లను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బార్లలో కనీస నిర్వహణ ఖర్చులు కూడా మిగలడం లేదని ఓనర్లు వాపోతున్నారు. ఒక్కో బార్కు జిల్లాల్లో అయితే నెలకు రూ. 2 లక్షలు, సిటీలో అయితే రూ. 3 లక్షలకు పైగా మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. బార్లు నడవకున్నా.. రెంట్లు, కరెంట్ బిల్లులు, వర్కర్ల జీతాలు తదితర ఖర్చులు భరించాల్సి వస్తోంది. బార్ కౌంటర్ ఆదాయం సగానికి కంటే తక్కువగా పడిపోయింది. కొన్ని చోట్ల గిరాకీలు లేకపోవడంతో కస్టమర్లను ఆకర్షించడానికి ఆఫర్లు కూడా పెడుతున్నారు. ఇక నష్టాలొచ్చినా సర్కారుకు మాత్రం ఎక్సైజ్ ట్యాక్స్(స్లాబ్ ను బట్టి ఏటా సగటున రూ.40 లక్షల దాకా), లైసెన్స్ ఫీజు కట్టక తప్పడం లేదు. ఎక్సైజ్, పోలీసు అధికారులకు నెలనెలా మామూళ్లు కూడా చెల్లించక తప్పడం లేదని ఓనర్లు వాపోతున్నారు. ఇలా అనేక కారణాలతో ఓనర్లకు గిట్టుబాటు కావడం లేదు. నిర్వహణ భారంగా మారడంతో సుమారు 100 దాకా బార్లను అమ్మినట్లు ఓనర్లు చెబుతున్నారు. ఇంకా 200కుపైగా బార్లను అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. అయితే అమ్మకాలకు పెట్టిన బార్లను బడా బాబులే సొంతం చేసుకుంటున్నారని, బ్లాక్ మనీని పెట్టుబడిగా పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అప్పులకు తెచ్చి నడుపుతున్నరు..
బార్ ఓనర్లలో చాలామంది మధ్య తరగతికి చెందినవారే. ముగ్గురు, నలుగురు కలిసి గ్రూప్గా ఏర్పడి బార్లను ఏర్పాటు చేశారు. వాళ్లు కూడబెట్టుకున్న కాస్తోకూస్తో డబ్బును బార్లపై పెట్టుబడిగా పెట్టారు. అయితే ఇప్పుడు లాభాలు రాకపోగా, నష్టాలు వస్తుండటంతో అనేక మంది వడ్డీలకు అప్పులు తెస్తున్నారు. మరికొంత మంది కుటుంబ సభ్యుల బంగారాన్ని తాకట్టు పెట్టి బార్లను నడిపిస్తున్నారు.
కరోనా తర్వాత 20 శాతం స్పెషల్ ట్యాక్స్ విధింపు..
పోయినేడాది లాక్డౌన్తో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది. దీంతో లిక్కర్ రేట్లను పెంచడంతో పాటు బార్లకు 20శాతం
స్పెషల్ ట్యాక్స్ విధించింది. రూ.2 లక్షలిస్తే స్పెషల్ ట్యాక్స్ రూ.40 వేలు కట్ చేసుకుని.. మిగతా 1.6 లక్షలకే స్టాక్ ఇస్తున్నారని బార్ల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కంటే ముందు రూ.5 వేల లోపే కట్టింగ్స్ ఉండేవని చెబుతున్నారు. ఆబ్కారీ శాఖ లిక్కర్ సరఫరా విషయంలో ధరలపై రౌండింగ్ ఫిగర్ చేసింది. రెండు లక్షల సరుకుపై 10 వేల దాకా రౌండింగ్ ఫిగర్ చార్జీ కట్ అవుతోంది. ఇక బీర్పై వచ్చే మార్జిన్ను కూడా తగ్గించారు. గతంలో 22 శాతం ఉండగా, దాన్ని 18 శాతానికి తగ్గించారు. ఇలా అనేక కారణాలతో నష్టాలు రావడంతో ఓనర్లు బార్లను అమ్మకానికి పెట్టారు.
బంగారం కుదవెట్టి నడిపిస్తున్న..
కరోనా తర్వాత బార్ బిజినెస్ పూర్తిగా పడిపోయింది. నిర్వహణ ఖర్చు కూడా వెళ్లడం లేదు. రెంట్లు, జీతాలు, చార్జీలకు కూడా వెళ్లడంలేదు. ఇటీవల నష్టాలు రావడంతో.. బంగారు కుదవెట్టిన. ఆ డబ్బులతోనే ఎక్సైజ్ ట్యాక్స్ కట్టిన. ఎంత కష్టపడినా గిట్టుబాటు కావడం లేదు. బార్ను అమ్మాలని చూస్తున్నా.
- తిరుపతి, బార్ ఓనర్, రామగుండం
ట్యాక్స్ పైసలు కూడా రాలే..
బెల్లంపల్లిలో బార్ నడిపేటోన్ని. కరోనా వచ్చాక బార్లకు ఎవరూ వస్తలేరు. మెయింటనెన్స్ ఖర్చు కూడా వెళ్లడం లేదు. ఆదాయం లేకపోవడంతో సర్కారుకు ట్యాక్స్ కట్టడం కాస్త లేట్ అయ్యింది. అధికారులు కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా బార్ లైసెన్స్ రద్దు చేశారు.
- సాయి కుమార్, బెల్లంపల్లి